మునుగోడులో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ: బరిలో ఎంతమంది ఉన్నారంటే?
నల్గొండ: మునుగోడు ఉపఎన్నిక నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ గడువు నేటి(సోమవారం)తో ముగిసింది. అక్టోబర్ 7వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. అక్టోబర్ 14న నామినేషన్ల ప్రక్రియ ముగిసే సరికి మొత్తంగా 130 మంది అభ్యర్థులు 199 నామినేషన్లు దాఖలు చేశారు.
కాగా, పరిశీలనలో 47 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారు. మిగిలిన 83 మంది అభ్యర్థుల్లో 36 మంది సోమవారం తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో ప్రస్తుం మునుగోడు ఉపఎన్నిక బరిలో 47 మంది ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఈ ఉపఎన్నిక అనివార్యమైంది. ఆయన ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. మునుగోడు అభివృద్ధి కోసమే తాను రాజీనామా చేశానని ఆయన ప్రకటించారు.
కాగా, మునుగోడు ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి పాల్వాయి స్రవంతి పోటీ చేస్తుండగా.. టీఆర్ఎస్ పార్టీ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బరిలో ఉన్నారు. బీజేపీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఈ మూడు పార్టీలు కూడా తమ తమ అభ్యర్థుల గెలుపు కోసం ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేశాయి.
మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నేతలు ఆ పార్టీ అభ్యర్థి తరపున విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. స్రవంతి తరపున కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి సహా నాయకులంతా ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ తరపున కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేతలు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.