లంచం అడిగితే అధికారులను తన్నండి, ఈ రోజు రాత్రి నుంచే: నాయిని
హైదరాబాద్: కార్మికశాఖలో లంచం అడిగే ఆ అధికారులను తన్నాలని తెలంగాణ హోం, కార్మిక శాఖల మంత్రి నాయిని నర్సింహా రెడ్డి కార్మికులకు సోమవారం నాడు పిలుపునిచ్చారు. ఆ తర్వాత తమకు ఫిర్యాదు చేస్తే సదరు అధికారిని సస్పెండ్ చేస్తామన్నారు.
కార్మిక శాఖ నుంచి సకాలంలో పథకాలు అందకపోతే శాఖ వద్ద ధర్నాలు చేయాలన్నారు. భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం వార్షికోత్సవ సందర్భంగా సోమవారం ఇక్కడ ఓ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడారు.
కార్మిక శాఖ పక్షాన సొమ్ము చెల్లింపు విషయంలో ఎవరైనా అధికారి అవినీతికి, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఈ రాత్రే అమల్లోకి తెస్తామన్నారు. కార్మికుల సంక్షేమానికి పలు చర్యలు చేపట్టామన్నారు. కార్మికులంతా తప్పకుండా కార్మికశాఖలో సభ్యులుగా చేరాలన్నారు.
అప్పుడే సంక్షేమ పథకాలు వర్తిస్తాయన్నారు. సభ్యత్వంపై అవగాహన కల్పించేందుకు అన్ని జిల్లాల్లో సమావేశాలను నిర్వహించాలని సూచించారు. అన్ని కార్మికసంఘాలు సమాఖ్యగా ఏర్పడితే భవనానికి స్థలం ఇచ్చి నిర్మాణం కూడా జరిపిస్తామన్నారు.
నల్గొండ జిల్లాకు చెందిన కార్మిక శాఖ అధికారి ఒకరు ఇబ్బందులకు గురి చేస్తున్నారని కార్మికులు మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు.
దీనికి స్పందించిన మంత్రి వెంటనే తగిన పరిష్కారం చూపుతామన్నారు. కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షలు నష్టపరిహారం చెల్లిస్తున్నామని ప్రకటించినా దానిని ఆచరణలో సక్రమంగా అమలు చేయడం లేదని పలువురు కార్మికులు ప్రశ్నించారు. తప్పకుండా న్యాయం చేస్తామని నాయిని చెప్పారు.
ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలోనే అయుత చండీయాగం
డిసెంబరులో నిర్వహించ తలపెట్టిన అయుత చండీ యాగం నిమిత్తం ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం స్థలాన్ని పరిశీలించారు. మెదక్ జిల్లా జగదేవపూర్ మండలం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ప్రస్తుతం పంటలు లేకుండా ఖాళీగా ఉన్న స్థలంలో యాగం నిర్వహించాలని నిర్ణయించారు.
ఆదివారం రాత్రి వ్యవసాయ క్షేత్రానికి వచ్చిన కేసీఆర్... సోమవారం మధ్యాహ్నం ఇద్దరు వేదపండితులతో కలిసి పలు స్థలాలను పరిశీలించారు. క్షేత్రం ప్రధాన ద్వారం ముందు పంటలు లేకుండా ఖాళీగా ఉన్న స్థలంలో యాగం చేయాలని తీర్మానించారు.
దాదాపు గంటపాటు అక్కడ కెసిఆర్ కలియ తిరిగారు. వెంటనే స్థలాన్ని చదును చేయించాలని సిబ్బందిని ఆదేశించారు. క్షేత్రానికి ఉత్తర, దక్షిణ భాగాల్లో యాగం నిర్వహించే సమయంలో ఇక్కడ బసచేసే బ్రాహ్మణులు, రక్షణ సిబ్బంది, అతిథులకు వసతి కోసం తాత్కాలిక గుడారాలను ఏర్పాటు చేయాలని సంకల్పించారు.