మెట్రో పిల్లర్కు పగుళ్లు: 'అది మన మెట్రో కాదు, అసలు ఆ రూట్లో లైన్ లేదు'
హైదరాబాద్: భాగ్యనగరంలో మెట్రో రైలు ఇటీవలే ప్రారంభమైంది. ప్రారంభం కాగానే సోషల్ మీడియాలో వాట్సాప్లో ఓ ప్రచారం జోరుగా సాగింది. ఓ మెట్రో రైలు పిల్లర్కు వచ్చిన పగుళ్లు మన హైదరాబాద్ మెట్రో రైలుకు చెందినవి అని పేర్కొంటూ.. జాగ్రత్తగా ఉండాలని ప్రచారం సాగింది.
ఈ ప్రచారంపై ఇప్పటికే మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పష్టత ఇచ్చారు. తాజాగా మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి కూడా దీనిపై మాట్లాడారు. ఐఎస్బీ-గచ్చిబౌలి మార్గంలో మెట్రో పిల్లర్లో పగుళ్లు అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అసత్యమని ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు.
హైదరాబాద్ది కాదు, పెషావర్ది
అసలు ఆ మార్గంలో మెట్రో లైనే లేదని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులపై మంత్రి కేటీఆర్ వివరణ ఇచ్చారని గుర్తు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో హైదరాబాద్లోనిది కాదని, పెషావర్లోని మెట్రో పిల్లర్ అన్నారు.
మన మెట్రో పిల్లర్ల బలం ఇదీ!
హైదరాబాద్లోని మెట్రో పిల్లర్లు వేల టన్నుల బరువు, భూకంపాలను సైతం తట్టుకునేలా నిర్మించామని ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ మెట్రోకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
ఇప్పటికే కేటీఆర్ వివరణ
దీనిపై మంత్రి కేటీఆర్ కూడా ఇటీవల వివరణ ఇచ్చారు. ఆ మెట్రో పిల్లర్ మన మెట్రోదీ కాదని, అలాగే పీవీ ఎక్స్ప్రెస్ వే కూడా కాదని చెప్పారు. అది పాకిస్తాన్లోనిది అని స్పష్టం చేసారు. ఈ మేరకు ఆయన గత ఫిబ్రవరి 24వ తేదీన వచ్చిన న్యూస్ను పోస్ట్ చేశారు.
రికార్డ్ సృష్టించిన మెట్రో రైలు
ఎంతో కాలం నిరీక్షణ తర్వాత హైదరాబాద్ మెట్రో రైలు నవంబర్ 29న నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. నాగోల్-మియాపూర్ మధ్య 30 కిలోమీటర్ల మేర నడుస్తున్న మెట్రో రైలుకు విశేష ఆదరణ లభిస్తోంది. తొలి రోజు, ఆ తర్వాత శనివారం, ఆదివారం ఏకంగా రెండు లక్షల మందికి పైగా ప్రజలు ప్రయాణించడం ద్వారా మెట్రోరైలు రికార్డు సృష్టించింది.