పార్టీ మారకుంటే బాగుండు: ఎర్రబెల్లితో సునీత, బాబుకు చిక్కులు తేవొద్దనేనా?
హైదరాబాద్: అసెంబ్లీ లాబీల్లో ఏపీ మంత్రి పరిటాల సునీత, తెలంగాణ రాష్ట్ర సీనియర్ రాజకీయ నాయకుడు ఎర్రబెల్లి దయాకర రావులు గురువారం నాడు ఉదయం ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా వారి మధ్య ఆసక్తికరమైన చర్చ సాగింది.
ఎర్రబెల్లి ఎదురుపడిన సందర్భంలో పరిటాల సునీత మాట్లాడుతూ.. మీరు పార్టీ మారకుండా ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. దానికి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఏపీలో చంద్రబాబు సుస్థిరంగా ఉండాలని, అలాగే ఇక్కడ మేం స్థిరంగా ఉండాలనే తెరాసలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
ఎర్రబెల్లి వ్యాఖ్యల వెనుక...!
ఏపీలో చంద్రబాబు స్థిరంగా ఉండాలనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పిన ఎర్రబెల్లి వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయని అంటున్నారు. చంద్రబాబు పైన ఆయనకు ఇంకా అభిమానం ఉందనే విషయం తేటతెల్లమవుతోందని అంటున్నారు.
విభజన నేపథ్యంలో తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం, ఏపీలో టిడిపి ప్రభుత్వం ఉంది. పక్కపక్క రాష్ట్రాలు కాబట్టి అంతర్రాష్ట్ర సమస్యలు వచ్చే అవకాశాలు కొట్టిపారేయలేము. పైగా విభజన నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య పలు అంశాలు వివాదంగా ఉన్నాయి.
ఏపీలో టిడిపి అధికారంలో ఉన్నందున.. తెలంగాణ, ఏపీ మధ్య వివిధ అంశాల విషయంలో సమస్య వచ్చినప్పుడు తెలంగాణలో టిడిపి నేతలు ఇబ్బందుల్లో పడవలసి వస్తుంది. అలాగే తెలంగాణలో టిడిపి నేతలు ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితులు వచ్చినా రావొచ్చు. అది ఏపీలో టిడిపికి చిక్కులు తీసుకు వస్తుంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు స్థిరంగా ఉండాలనే తాము మారామని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారని అంటున్నారు.