స్నేక్ గ్యాంగ్: దయానీ తల్లి పిటిషన్ కొట్టివేత
హైదరాబాద్: స్నేక్ గ్యాంగ్ కేసులో అనుమానితునిగా ఉన్న దయానీని పహాడీషరీఫ్ పోలీసులు నిర్బంధించారంటూ ఆయన తల్లి పెట్టుకున్న హెబియస్ కార్పస్ పిటిషన్ను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు కొట్టివేసింది. దయానీ జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నట్లు పోలీసులు వివరాలు సమర్పించారు.
వాటిని పరిగణలోకి తీసుకున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతి సేన్ గుప్తా నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్ను కొట్టివేస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.
స్నేక్ గ్యాంగ్లో సభ్యునిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తన కుమారుడిని వదిలి పెట్టాలని దయానీ తల్లి కోర్టును ఇటీవల ఆశ్రయించింది. ఈ పిటీషన్ను చీఫ్ జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా, జస్టిస్ పివి సంజయ్కుమార్లతో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది.
తన కుమారుడిని స్నేక్ గ్యాంగ్ సభ్యుడు అంటూ అక్రమంగా కేసులో ఇరికించారని ఆరోపించారు. ఈ కేసుకు సంబంధించి నివేదిక ఇవ్వాలని పహాడీ షరీఫ్ ఇన్స్పెక్టర్ను కోర్టు ఆదేశించింది. అయితే నివేదిక ఇవ్వకపోవడంతో కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు. మంగళవారం ఇన్స్పెక్టర్ కోర్టుకు హాజరై నివేదిక ఇచ్చారు. పిటీషనర్ కుమారుడు స్నేక్ గ్యాంగ్ సభ్యుడని, అనేక కేసుల్లో అతని ప్రమేయం ఉందని తెలిపారు.