తెలంగాణ ఏర్పడ్డాక, కేసీఆర్ భావోద్వేగం: తెలుగులో మోడీ, పరస్పరం కితాబు
గజ్వెల్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నేను మొదటిసారి ఇక్కడకు రావడం చాలా సంతోషంగా ఉందని ప్రధాని మోడీ తెలుగులో వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలందరికీ నా హృదయ శుభాకాంక్షలు అన్నారు. భారత దేశంలో అత్యంత పిన్న వయసున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు.
మిషన్ భగీరథను ప్రారంభించిన అనంతరం ప్రధాని మోడీ బహిరంగ సభలో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఇంత తక్కువ సమయంలోనే ప్రజల ఆశయాలకు అనుగుణంగా ముందడుగు వేస్తోందన్నారు. తెలంగాణ ప్రజల విశ్వాసానికి అనుగుణంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని విశ్వసిస్తున్నానని చెప్పారు.
బీజేపీతోనే తెలంగాణ, మోడీ! మాకెంతో చేశారు: హిందీలో కేసీఆర్, వెంకయ్య వల్లే..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భుజం భుజం కలిసి ముందడుగు వేస్తే వచ్చే ఫలితానికి ఇది నిదర్శనం అన్నారు. ఈనాటి కార్యక్రమం పంచశక్తుల ఆవిష్కారంగా తోచిందన్నారు. ఈ కార్యక్రమం కేంద్ర, రాష్ట్రాల సంబంధాలకు ప్రతీక అన్నారు.
ఈ రెండేళ్లలో కేసీఆర్ ఎన్నోసార్లు తనను కలిశారన్నారు. నీటి విషయం ఎత్తితేనే కేసీఆర్ భావోద్వేగానికి లోనవుతారని చెప్పారు. తాగు, సాగునీటి అంశంలో కేసీఆర్ ఎప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తుంటారన్నారు. కేసీఆర్ తనను కలిసిన ప్రతిసారి అభివృద్ధి, సాగు, తాగునీటి గురించే మాట్లాడేవారన్నారు. కేసీఆర్ సంకల్పంతో మిషన్ భగీరథ విజయవంతమవుతోందన్నారు.
సంకల్పం ఉంటే ఏదైనా చేయొచ్చు అనేందుకు ఇది నిదర్శనం అన్నారు. రైతులకు నీరివ్వడం ఓ బృహత్తర కార్యక్రమం అన్నారు. భారత దేశానికి రైతులు పట్టుగొమ్మలు అన్నారు. అందరికీ నీరివ్వడం మన బాధ్యత అన్నారు. నీటిని కాపాడుకుంటేనే భవిష్యత్తు అన్నారు. అభివృద్ధిలో రాష్ట్రాల మధ్య పోటీ ఉండాలన్నారు.
ఇప్పుడు మిగులు విద్యుత్
పొలానికి నీరు అందితే భారత దేశ రైతు బంగారం పండిస్తాడన్నారు. జలమే జీవమని, ప్రతి నీటి చుక్కను ఒడిసిపడితేనే భవిష్యత్తు అన్నారు. నిన్నటి వరకు విద్యుత్ కొరతతో ఉన్న రాష్ట్రాలు ఇప్పుడు మిగులు విద్యుత్ రాష్ట్రాలు అయ్యాయని చెప్పారు.
ఒకప్పుడు రూ.11.50కి దొరికిన విద్యుత్, ఇప్పుడు కేవలం రూపాయి పది పైసలకే దొరుకుతోందన్నారు. దేశవ్యాప్తంగా విద్యుత్ రంగంలో అనేక సంస్కరణల ఫలితమే ఇదన్నారు. ప్రతి నీటి బొట్టును వ్యవసాయానికి మళ్లిస్తే గ్రామాల్లో జీవణ ప్రమాణాలే మారిపోతాయన్నారు.
ప్రపంచంలో ఇప్పుడు తాగునీటి సమస్య ఉందన్నారు. నీళ్లు, సౌరశక్తి ప్రకృతి ప్రసాదించిన వరాలు అన్నారు. సౌరశక్తిని ఒడిసిపడితేనే భవిష్యత్తు విద్యుత్ అవసరాలకు భరోసా అన్నారు. ఎరువులు అందుబాటులోకి తెచ్చేందుకు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించామన్నారు.
లేఖ రాసే సీఎం లేరు
రైతుకు సరమైన ధరల్లో ఎరువులు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. నాలుగేళ్ల క్రితం యూరియా కోసం ప్రధానికి లేఖలు రాసేవారన్నారు. ఇప్పుడు యూరియా కోసం లేఖలు రాసే ముఖ్యమంత్రి లేరన్నారు. ఎరువులు కావాలని సీఎంలు లేఖ రాసే పరిస్థితి రావొద్దన్నారు. యూరియా నల్ల బజారుకు వెళ్లకుండా వేపపూత పూస్తున్నామన్నారు.
గతంలో ఎరువులు బ్లాక్ మార్కెట్లో కొనవలసి వచ్చేదన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు ఎరువుల కర్మాగారం లేదని, ఇప్పుడు దానికి శిలాఫలకం వేశామన్నారు. రైతుల కోసం సబ్సిడీ ఎరువులు ఇస్తామన్నారు. దేశంలో ఇప్పుడు ఎక్కడా ఎరువుల కొరత లేదన్నారు. ఎరువుల ధరలు తగ్గాయని చెప్పారు.
తెలంగాణ అడిగిన రైల్వే లైన్లు పూర్తి చేస్తాం
ఎంతోకాలంగా తెలంగాణ అడుగుతున్న రైల్వే లైన్లను తాము పూర్తి చేసి చూపిస్తామన్నారు. ఆర్థిక అభివృద్ధి కోసం రైల్వే లైన్లను కలుపుతున్నామన్నారు. నిర్దేశిత సమయంలో రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. తెలంగాణలో పెండింగులో ఉన్నవి పూర్తి చేస్తామన్నారు. కాగా, అంతకుముందు కేసీఆర్ ప్రధాని మోడీపై ప్రసంసలు కురిపించారు.