రాహుల్ జన్మదిన వేడుకలు సాదాసీదాగా జరపాలి.!కరోనా క్లిష్ట సమయంలో ఆర్బాటాలు వద్దన్న ఉత్తమ్.!
హైదరాబాద్ : కరోనా వైరస్ క్లిష్ట సమయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తమ అధినేత జన్మదిన వేడుకల పట్ల కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో రాజకీయ నాయకులు శంకుస్థాపనల పేరుతో కరోనా నియమాలను ఉల్లంఘిస్తున్నప్పటికి, కాంగ్రెస్ పార్టీ మాత్రం కోవిడ్-19 మార్గదర్శకాలను పాటించి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తామని స్పష్టం చేస్తున్నారు. అందులో భాగంగా తమ ప్రియతమ నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను అత్యంత నిరాడంబరంగా జరపాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు పీసిసి ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫేస్ బుక్ ద్వారా కాంగ్రెస్ శ్రేణులకు వినూత్న సందేశం అందించారు.
సాదా సీదాగా రాహుల్ జన్మదిన వేడుకలు.. తెలంగాణ శ్రేణులకు ఉత్తమ్ పిలుపు..
ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ, వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఎలాంటి ఆర్భాటాలు, హంగామాలు లేకుండా నిర్వహించాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. అంతేకాకుండా అన్న దానాలు, పేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ, రోగులకు పండ్లు పంపిణీ తదితర కార్యక్రమాలు నిర్వహించాలి గాని, జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా కేక్ కట్టింగ్ లతో హడావిడి చేసి గుంపులు గుంపులుగా ఏర్పడవద్దని టీపిసిసి ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. అంతే కాకుండా సామాజిక దూరం పాటిస్తూ పైదలకు సహాయం చేయాలని, వైరస్ కట్టడి కోసం పనిచేస్తున్న వారిని సన్మానించాలని ఉత్తమ్ కోరారు.
నిత్యావసర సరుకులు పంచండి.. కేకుల కటింగ్ మాత్రం వద్దు.. తేల్చి చెప్పిన టీపిసిసి..
అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ ఆర్సీ కుంతియా టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. అంతే కాకుండా టీపిసిసి ముఖ్య నాయకులు, డీసీసీ అధ్యక్షులు, నియోజక వర్గ నాయకులు, అనుబంధ సంఘాల ఛైర్మన్ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నెల 19వ తేదీన ఏఐసీసీ మాజీ అధ్యక్షులు, ఎంపీ రాహుల్ గాంధీ జన్మదినోత్సవం సందర్బంగా రాష్ట్ర స్థాయి నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ లో నిర్వహించిన కుంతియా పలు సూచనలు చేసారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని ప్రాంతాలలో ఉదయం నుంచి అన్నదానాలు, నిత్యావసర వస్తువుల పంపిణీ, పేదలకు సాయం అందించడం, రోగులకు పండ్లు పాలు పంపిణీ తదితర కార్యక్రమాలు చేయాలని సూచించారు.
కరోనా క్లిష్ట సమయంలో ఉన్నాం.. ఆర్బాటాలకు దూరంగా ఉండాలన్న టీపిసిసి ఛీఫ్..
అంతే కాకుండా తెలంగాణ రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులను ప్రస్తుత గులాబీ పార్టీ పక్కన పెట్టిందని, 2014 లో తెలంగాణ ఇచ్చాక పాత ప్రాజెక్టులను పట్టించుకోకుండా కొత్త ప్రాజెక్టులను చేపట్టిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు. కృష్ణ, గోదావరి ప్రాజెక్టులను పరిశీలనకు నిభందనల ప్రకారం కాంగ్రెస్ ప్రాజెక్టుల సందర్శనకు సన్నాహాలు చేసుకుంటే గృహ నిర్బందాలు, అరెస్టులు చేస్తూ అణచివేతకు పాల్పడుతున్నారని, తెలంగాణ సాగునీటికోసం కాకుండా సీఎం చంద్రశేఖర్ రావు కమీషన్ల కోసమే ప్రాజెక్టులు కడుతున్నారని ఉత్తమ్ మండిపడ్డారు.
అధికంగా వచ్చిన కరెంటు బిల్లుల గురించి కేసీఆర్ పునరాలోచించాలి.. డిమాండ్ చేసిన కాంగ్రెస్..
ఇదిలా ఉండగా కరోనో కష్ట కాలంలో విపరీతంగా కరెంట్ బిల్లులు వేశారని, రావాల్సిన బిల్లు కంటే అధికంగా బిల్లులు వచ్చాయని, బిల్లులు కట్ట లేని నిరుపేదలు అయోమయంలో పడిపోయారని ఉత్తమ్ పేర్కొన్నారు. కరోనో వైరస్ నివారణలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని ఉత్తమ్ మండిపడ్డారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్సీ కుంతియా, టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస కృష్ణన్ బోసు రాజు, ఎంపీ టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు రేవంత్ రెడ్డి, కుసుమ కుమార్, మాజీ పీసీసీ అధ్యక్షులు వి హనుమంత రావ్, లక్ష్మయ్య, మండలి మాజీ విపక్ష నేత షబ్బీర్ అలీ, ఏఐసీసీ కార్యదర్శులు వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్ లతోపాటు నాయకులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.