వాగు ఉధృతికి కొట్టుకుపోయిన ఎడ్లబండి, ఎడ్లు మృతి.. నాలాలో వ్యక్తి మృతి
అల్పపీడన ప్రభావం వర్షం దంచికొట్టింది. హైదరాబాద్ మహా నగరం తడిసిముద్ద కాగా.. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా అదేవిధంగా వర్ష ప్రభావం ఉంది. ఇటు
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో వాగులో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. దీంతో ఎడ్లబండి కొట్టుకుపోయింది. దీంతో ఆ రెండు ఎడ్లు మృతి చెందాయి. ఎడ్లబండిలో ఉన్న రైతు అతికష్టంపై బయటపడ్డాడు. జన్నారం గ్రామానికి చెందిన అన్వర్ రోజులాగే శనివారం తన ఎడ్లబండితో జన్నారం వాగు దాటి పొలానికి వెళ్లాడు.
శుక్రవారం రాత్రి నుంచి ఎగువన కురుస్తున్న వర్షాలకు జన్నారం వాగులో వరద ఉధృతి క్రమంగా పెరిగింది. పొలం పని ముగించుకున్న అన్వర్ వాగు దాటుతుండగా ఎడ్లబండితోపాటు రెండు కాడెడ్లు కొట్టుకుపోయాయి. అన్వర్ వాగు ప్రవాహంలో కొంత దూరం కొట్టుకుపోయాడు. వాగు ఒడ్డు పట్టు దొరకడంతో అతికష్టంపై పైకి చేరుకున్నాడు. ఈ ప్రమాదంలో రెండు ఎడ్లు మృతిచెందాయి. రెండు నెలల క్రితమే ఎడ్లను రూ. 80 వేలకు కొనుగోలు చేశానని బాధిత రైతు కంట తడిపెట్టాడు.

ఇటు జడ్చర్ల పట్టణంలో మూడు గంటల పాటు వర్షం దంచికొట్టింది. పట్టణంలోని పలు కాలనీలు జలమయం అయ్యాయి. నల్లకుంట ప్రాంతంలో నీటి ఉధృతి ఎక్కువ కావడంతో కట్ట తెగిపోయి.. పట్టణ ప్రధాన రహదారిపైకి వర్షపు నీరు చేరగా రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. వాల్మీకినగర్లో నీటి ఉధృతికి నాలాలో పట్టణానికి చెందిన రాఘవేందర్ అనే వ్యక్తి కొట్టుకుపోయి మృతి చెందాడు. వెంటనే గమనించిన స్థానికులు రాఘవేందర్ను నాలా నుంచి వెలికి తీసి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అయితే అప్పటికే రాఘవేందర్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో నీరు ఇళ్లలోకి చేరింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో వరద నీరు నిలువకుండా చర్యలు చేపడుతున్నామని మున్సిపల్ అధికారులు తెలిపారు. ఇవాళ, రేపు కూడా వర్ష ప్రభావం ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications