సెటిలర్స్కు మీరిచ్చేదేంటి: రేణుకా, కెసిఆర్ అడిగితే పనులు చేశా: జైపాల్ రెడ్డి
హైదరాబాద్: భాగ్యనగరంలోని సెటిలర్స్కు మీరు ఇచ్చేది ఏమిటి.. వారికి రాజ్యాంగమే రక్షణ కల్పిస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి గురువారం అధికార టిఆర్ఎస్ పార్టీ పైన మండిపడ్డారు. సీమాంధ్రుల పైన ప్రేమకు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలే కారణమని చెప్పారు.
మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు ధైర్యం ఉంటే తమ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలచే రాజీనామా చేయించి, తిరిగి పోటీ చేయించి గెలుపించుకోవాలని సవాల్ చేశారు. కాంగ్రెస్ పార్టీవి మాటలు కాదని, చేతలు అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో సెటిలర్స్ పాత్ర ఎంతో ఉందని చెప్పారు.
హైదరాబాద్కు మెట్రో రైలు యూపిఏ వల్లే: జైపాల్ రెడ్డి
హైదరాబాదుకు మెట్రో రైలు యూపిఏ ప్రభుత్వమే ఇచ్చిందని మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి అన్నారు. తాను కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాదుకు రూ.2,463 కోట్లు ఇచ్చానని, 70వేలకు పైగా ఇళ్లూ మంజూరు చేయించానని చెప్పారు.
గ్రేటర్ హైదరాబాదును అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న వారు ఓసారి ఆలోచించాలని జైపాల్ రెడ్డి అన్నారు. తాను కేంద్రమంత్రిగా ఉండగా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అభివృద్ధి పనులకు డబ్బును ఇచ్చానని చెప్పారు.
నల్గొండ జిల్లా, కరీంనగర్ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లాల్లో మంచి నీటి సౌకర్యానికి డబ్బులిచ్చానన్నారు. అప్పట్లో కేసీఆర్ అడిగితే ఎన్నో పనులు చేశానని తెలిపారు. గ్రేటర్ హైదరాబాదును తానే పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశానన్నారు.
అయితే ఇప్పుడు హైదరాబాదును అందరూ అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్నారని విమర్శించారు. సెటిలర్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వారికే సీట్లు కేటాయిస్తామని టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ చెప్పారు. రేపు, ఎల్లుండి జాబితా విడుదల చేస్తామన్నారు. మేయర్ అభ్యర్థి పైన చర్చిస్తున్నామన్నారు.
ఓటమి భయంతో ఓట్లు తొలగించారు: డాక్టర్ కె లక్ష్మణ్
ఓటమి భయంతోనే ప్రభుత్వం హైదరాబాదులో చాలా ఓట్లు తొలగించిందని బిజెపి శాసన సభా పక్ష నేత డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. బిజెపి - టిడిపిని గెలిపిస్తే ఎవరూ చేయని అభివృద్ధి చేస్తామన్నారు.
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పతంగుల పండుగ
పీపుల్స్ ప్లాజాలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పతంగుల పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. రైట్ టు ఓట్ ఛాంపియన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడారు.
సంక్రాంతి పండుగను దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో జరుపుకుంటారని, ఇవాళ సూర్యుడు తన దిశను మార్చుకుని మకర రాశిలోకి ప్రవేశిస్తాడని అందుకే మకర సంక్రాంతి అంటామన్నారు. మనం కూడా మనలోని చెడు గుణాలను వదులుకుని జీవితంలో మార్పులు తెచ్చుకోవాలన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అందరూ ఓటింగ్లో పాల్గొనాలని, కచ్చితంగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకే తాము నగరంలో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నామని మంత్రి చందూలాల్ అన్నారు. ఆగాఖాన్ అకాడమీలో అంతర్జాతీయ పతంగుల సంబరాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు.