అమరావతి సహకారం తీసుకుంటే, విలాసజీవితం గడుపుతూ: కేటీఆర్పై రేవంత్ తీవ్ర విమర్శలు
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత, కొడంగల్ తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సోమవారం ఆపద్ధర్మ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబంపై నిప్పులు చెరిగారు. తెలంగాణను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటు వేయాలని సూచించారు.
కృష్ణా, గోదావరి జలాలు పైన తెలంగాణలో ఉన్నాయని, కింద ఏపీ ఉందని, మనం గేట్లు తెరవాల్సిందేనని, అమరావతిలో ఎవరు ఉన్నా సమన్వయంతో ముందుకు సాగితే బాగుంటుందని చెప్పారు. కాంగ్రెస్ నేతలు కర్ణాటక వెళ్లి కూడా అత్యవసరంగా నీరు విడుదల చేయించిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు.
కేసీఆర్, కేటీఆర్ వస్తే బట్టలూడదీసి పంపండి, కొండను తవ్వి ఎలుకని పట్టారు: ఐటీ దాడులపై రేవంత్
అమరావతి సహకారం తెలంగాణ తీసుకుంటే
అమరావతి సహకారం తెలంగాణ తీసుకుంటే, అమరావతితో ఉన్న చిక్కుముళ్లను, సమస్యలను పరిష్కరించుకోవడానికి సానుకూలంగా వాటిని కాంగ్రెస్ ఉపయోగించుకుంటుందని రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ ఈ రెండింటికి కాకుండా తెరాసకు ఓటేస్తే గడీలో నివసిస్తున్న దోపిడీదారు ఇంటికే పోతుందని విమర్శలు గుప్పించారు.
ప్రగతి భవన్ ఓ పైరవీ భవన్
తెరాసకు ఓటు వేయడం అంటే దొంగ చేతికి తాళం చేతులు ఇచ్చినట్లే రేవంత్ అన్నారు. గతంలో దొంగలు గుట్టలు, గుహల్లో దాక్కొని గ్రామాలపై దాడి చేసి దోపిడీ చేసేవారని, ఇప్పుడు కేసీఆర్ కుటుంబం ప్రగతి భవన్ పేరు మీద నిర్మించుకున్న పైరవీ భవన్లో కుటుంబ సభ్యులు అందరూ దోపిడీ దొంగల్లా తయారయ్యారని ఆరోపించారు.
కేటీఆర్ మిడిమిడి జ్ఞానం
కేసీఆర్ కుటుంబ సభ్యులు వివిధ హోదాల్లో తెలంగాణ మీద దాడి చేసి దోచుకుంటున్నారని రేవంత్ విమర్శించారు. తెలంగాణ సమాజం దీనిని ఆలోచించాలన్నారు. దోచుకునే వారికి అధికారం ఇద్దామా అని ప్రశ్నించారు. అభివృద్ధికి అవసరమైతే ఏపీ సహకారం తీసుకోవచ్చునని, రెండు రాష్ట్రాల సమస్యలు పరిష్కరించుకోవచ్చునని అన్నారు. కేటీఆర్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారన్నారు. బాల్క సుమన్ ఓ బానిస సుమన్ అన్నారు.
కేటీఆర్కు ఒక్కసారిగా అధికారం, ధనం రావడంతో విలాస జీవితం
కేటీఆర్కు ఒక్కసారిగా అధికారం రావడం, విపరీతమైన ధనరాశులు రావడం, విలాసజీవితం గడుపుతూ, అప్పుడప్పుడు విరామ సమయంలో బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, దాని వల్ల ప్రయోజనం లేదని, షోలో సినిమాలో గబ్బర్ సింగ్ వంటి దోపిడీదారును చూశామని, ఇప్పుడు కేసీఆర్ కుటుంబం అలాంటిదేనని, ఆ కుటుంబానికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. అంతకుముందు, మరో కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట రెడ్డి మాట్లాడుతూ.. మేం ఎవరితో పొత్తు పెట్టుకుంటే మీకు (తెరాసకు) ఏం బాధ అని, మా పొత్తులను చూసి తెరాస భయపడుతోందన్నారు.