పట్టు బిగించిన రేవంత్ - ఢిల్లీ కేంద్రంగా : అసమ్మతి నేతలకు చెక్ : నో అపాయింట్మెంట్..!!
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ ఢిల్లీ కేంద్రంగా పావులు కదుపుతున్నారు. సొంత రాష్ట్రంలో తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న సొంత పార్టీ అసమ్మతి నేతలకు ఢిల్లీలో తన పట్టు నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీలో అసమ్మతి నేతలకు చెక్ పెట్టటం ద్వారా సొంత రాష్ట్రంలో వారి వాయిస్ కు మద్దతు పెరగకుండా చూసే ప్రయత్నాలు చేస్తున్నారు. కొద్ది రోజులుగా హైదరాబాద్ కేంద్రంగా రేవంత్ పైన సొంత పార్టీ లోని వ్యతిరేకులు స్వరం పెంచారు. వరుసగా సమావేశాలు.. అల్టిమేటం ఇస్తున్నారు.

ఢిల్లీ నుంచే చెక్ పెట్టే వ్యూహాలు
జగ్గారెడ్డి లాంటి నేతలు పార్టీ హైకమాండ్ కు తాము విధేయులమని చెబుతూనే..రేవంత్ తో ప్రచ్ఛన్న యుద్దం కొనసాగిస్తున్నారు. ఇక, ఇప్పుడు రేవంత్ - అసమ్మి నేతలు ఢిల్లీలో తమ కార్యాచరణ ముమ్మరం చేసారు. రేవంత్ పైన ఫిర్యాదు చేయటానికి.. రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు వివరించటానికి కాంగ్రెస్ అసమ్మతి నేతలు ఢిల్లీ చేరారు.అయితే, వారికి ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ, అగ్రనేత రాహుల్గాంధీ మాత్రమే కాకుండా.. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాష్ట్ర ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ కూడా అపాయింట్మెంట్ ఇవ్వడానికి నిరాకరించారు. రేవంత్ కు వ్యతిరేకంగా మరో ఇద్దరు ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి - ఉత్తమ్ కుమార్ రెడ్డి మద్దతు తమకు లభిస్తుందని అంచనా వేసిన అసమ్మతి నేతలకు.. కాంగ్రెస్ హైకమాండ్ వద్ద జరుగుతున్న పరిణామాలు తెలిసిన వారిద్దరూ మౌనం పాటించారు.

ఆశించిన మద్దతు లభించకపోవటంతో
ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కీలక టీంలో స్థానం ఆశిస్తున్నారు. దీంతో..ఎవరి పైనా ఫిర్యాదులు చేయటం .. అసమ్మతి నేతలకు మద్దతుగా నిలవటం ద్వారా హైకమాండ్ వద్ద పరపతి తగ్గించుకోవటానికి సిద్దంగా లేరని తెలుస్తోంది. తాజాగా అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్ అధినాయకత్వం అసమ్మతి వ్యవహారాల పైన కఠినంగా వ్యవహరించాలనే అభిప్రాయంతో ఉంది. ఎక్కడా అటువంటి వాటిని ప్రోత్సహించకూడదని నిర్ణయించింది. ఇదే అంశం ఉత్తమ్ .. కోమటిరెడ్డి వంటి వారు గ్రహించటంతో వారు సైతం ప్రస్తుతం వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారు. తాజాగా.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్లమెంట్ ప్రాంగణంలో సోనియాను కలిసే ప్రయత్నం చేసినా.. స్పందన లేదని చెబుతున్నారు.

ప్రోత్సహించని అధినాయకత్వం
ఇదే సమయంలో రేవంత్ కు వ్యతిరేకంగా తెలంగాణలోని కొందరు కాంగ్రెస్ నేతలు వరుసగా లేఖలు రాస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరు లేఖలు రాసినా.. సోనియాగాంధీ వాటిని పార్టీ ప్రధాన కార్యదర్శికి పంపించడం, ఆయన రేవంత్తో వాటి గురించి చర్చిస్తుండడంతో అసమ్మతి కార్యకలాపాలు రేవంత్కు ఎప్పటికప్పుడు తెలిసిపోతున్నాయి. ప్రస్తుతం అసమ్మతి స్వరం వినిపిస్తున్న నేతలకు పార్టీలో ఉన్న గుర్తింపు.. ప్రజల్లో ఉన్న బలం పైనా చర్చ సాగుతోంది. రేవంత్ వ్యతిరేక శిబిరానికి ఇప్పుడు ఢిల్లో పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదులు చేయగలిగినా..వారిని రేవంత్ కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకొనే విధంగా ప్రభావితం చేయలేదరనే వాదన వినిపిస్తోంది.

నెక్స్ట్ స్టెప్ ఏంటి.. రూటు ఎటు
దీంతో..ఏఐసీసీ నేతలు.. కాంగ్రెస్ సీనియర్లతో సత్సంబంధాలు సాగిస్తున్న రేవంత్.. ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగానే తనకు వ్యతిరేకంగా పని చేస్తున్న నేతలకు చెక్ పెడుతున్నారు. దీని ద్వారా..హైకమాండ్ తనకే మద్దతుగా ఉందనే బలమైన సంకేతాలు ఇవ్వటంలో సక్సెస్ అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో సమయం కోసం ఎదురు చూడటం మినహా రేవంత్ వ్యతిరేక శిబిరం ఏ అడుగు ముందుకు వేయలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications