రోహిత్కు ఎస్సీ సర్టిఫికేట్ ఎలా వచ్చింది: తండ్రి ట్విస్ట్, అసలు సూసైడ్ నోట్ దాచారా?
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో మృతి చెందిన వేముల రోహిత్ తండ్రి మణి కుమార్ మరోసారి కొడుకు ఆత్మహత్య పైన స్పందించారు. రోహిత్కు ఎస్సీ సర్టిఫికేట్ ఎలా వచ్చిందో తనకు తెలియదన్నారు. దీని పైన విచారణ జరిపి వాస్తవాలు నిగ్గుతేల్చాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆ సూసైడ్ నోట్ రాసింది తన కడుకు కాదని, తన కొడుకు మృతి వెనుక గల కారణాలను బయటపెట్టాలన్నారు. అసలు సూసైడ్ నోట్ దాచి పెట్టారని ఆరోపించారు. రోహిత్ ఆత్మహత్యకు కులాల పేరుతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. చట్ట ప్రకారం విడాకులు తీసుకున్నా వారి యోగక్షేమాలు తానే చూస్తున్నానన్నారు.
తన కొడుకు ఆత్మహత్య పైన సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. తాము ముమ్మాటికీ వడ్డెర కులస్తులమే అన్నారు. తాము ఎస్సీ కులానికి చెందినవారమని తన భార్య ఎందుకు అబద్దం చెబుతుందో అర్థం కావడం లేదన్నారు.
మూడు రోజుల క్రితం కూడా మణి కుమార్ మాట్లాడారు. రోహిత్ది ఏ కులమనే విషయమై చర్చలు సాగుతున్న నేపథ్యంలో తమది వడ్డెర కులమేనని అతని తండ్రి తేల్చి చెప్పారు. దళిత విద్యార్థిని బలవన్మరణానికి పురిగొల్పారని కొందరు విద్యార్థులు ఆరోపిస్తుంటే, ఎవరు చనిపోయినా బాధపడాల్సిందేనని, అయినా అతను దళిత విద్యార్థి కాదని మరికొందరు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో రోహిత్ తండ్రి ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను దళితుడిని కాదని, బిసి 'ఏ' గ్రూపునకు చెందినవాడనని ఓ టివి చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ నైజం తనకు ఇష్టమని, తన కులం వడ్డెర అనీ, వడ్డెరగానే బతకనివ్వాలని, సంచార జాతికి చెందిన వడ్డెర కులస్తులను అవసరమైతే ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరారు.
తన కుటుంబం గురించీ ఆయన చెప్పిన వివరాలు ఆయన మాటల్లో.. 'రోహిత్ అసలు పేరు మల్లిక్ చక్రవర్తి అలియాస్ మల్లయ్య. గుంటూరులో పదో తరగతి చదివే వరకూ అదే పేరు ఉంది. ఆ తర్వాత ఎందుకు మార్చుకున్నాడో నాకు తెలియదు. నల్గొండ జిల్లా రఘునాథ పాలెం మాది. గుంటూరు జిల్లా గురజాలలో ఉంటాం.
నాకు ఇద్దరు కొడుకులు మల్లిక్ చక్రవర్తి, రాజా చైతన్య కుమార్. నేను రాళ్లు కొట్టే వృత్తిని వదులుకొని సెక్యూరిటీ గార్డుగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నా. నా భార్యతో ఏర్పడిన మనస్పర్ధల కారణంగా నేను గుంటూరులోనే ఉంటున్నాను. మా రెండో కుమారుడు హైదరాబాద్లో ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు.
రోహిత్ ఆత్మహత్య: వీసీ అప్పారావు సెలవుపై ఎందుకు వెళ్లారు?
అతనితో కలసి ఉండొచ్చని రోహిత్, తల్లి రాధిక హైదరాబాద్ వెళ్లారు. అయితే ఇంటర్ వరకు బిసి కులస్థుడిగా ఉన్న మల్లిక్ చక్రవర్తి ఎస్సీగా మారినట్టు తన దృష్టికి వచ్చింది. నువ్వు మెరిట్ స్టూడెంట్వు నీకు ఎక్కడైనా పిహెచ్డిలో సీటు దొరుకుతుంది కదాని అడిగితే, కాదు.. ఎస్సీ సర్ట్ఫికెట్ ఉంటే కాస్త ప్రయోజనం ఉంటుందని రోహిత్ నాతో అన్నాడు.
వర్శిటీలో ఆత్మహత్యకు పాల్పడిన విషయం నాకు నా భార్య ద్వారానే తెలిసింది. రావడంలో ఆలస్యమైనందున కొడుకు మృతదేహాన్ని చూడలేక పోయాను. ఇక్కడికి వచ్చి నా కొడుకు స్మారక స్థూపానికి నమస్కరించి, కాస్తంతా బూడిద దొరికితే అమరావతిలో కలిపేందుకు వచ్చాను. నా దగ్గర కనీసం బస్సు చార్జీలు కూడా లేవు.
చనిపోతే తీర్థయాత్రలకు వెళ్లినట్లు వెళ్తారా: వెంకయ్య, హెచ్సియులో ఇలా.. (పిక్చర్స్)
టికెట్టు లేకుండా రైల్లో వచ్చా. గత 8 నెలలుగా నాతో నా భార్య మాట్లాడటం లేదు. 20 రోజుల క్రితమే వారు గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చారు. నా కొడుకు జనం కోసం మృతి చెందాడు. నేను ఎంతో గర్విస్తున్నా. నా కొడుకు మృతి, కులంపై కొందరు రాజకీయాలు చేస్తున్నారు. నాకర్థం కావడంలేదు. నా కులం మాత్రం వడ్డెర, బిసి 'ఏ' గ్రూపు అవసరమైతే ఎస్టీ జాబితాలో మార్చండి'అంటూ రోహిత్ తండ్రి మణి కుమార్ విజ్ఞప్తి చేశారు.