వందల బిల్డింగ్లు, హైద్రాబాద్ జర్నలిస్ట్లు ఈర్ష్యపడేలా: ఓరుగల్లుకు కెసిఆర్ భారీ వరాలు, ఇవే
వరంగల్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వరంగల్ జిల్లా పైన వరాల జల్లు కురిపించారు. మూడు రోజుల పాటు ఆయన ఓరుగల్లులో పర్యటిస్తున్నారు. బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వరంగల్ నగరంలో కొన్ని వందల కొత్త భవంతులు నిర్మిస్తామని చెప్పారు.
వరంగల్ జనాభా 4.5 లక్షలకు పెరిగే అవకాశముందన్నారు. జిల్లాలోని చెరువులన్నింటీని మిషన్ కాకతీయ కింద పరిశుభ్రం చేస్తామన్నారు. 200 నుంచి 300 ఏకరాల్లో థీమ్ పార్కును ఏర్పాటు చేస్తామన్నారు. కబ్జాదారులపైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలను వేగవంతం పెంచాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. వచ్చే ఏడాది జూన్ నాటికి మిడ్ మానేరును పూర్తిగా నింపుతామన్నారు. నాలుగు నియోజకవర్గాల్లోని పలు నియోజకర్గాలకు ఏప్రిల్ 30వ తేదీ నుంచి గోదావరి జలాలు అందిస్తామన్నారు.
లక్నవరం చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. దేవాదుల నీటి ప్రాజెక్టును రామప్పకు అనుసంధానం చేస్తామన్నారు. వరంగల్కు వెటర్నరీ కాలేజీ, అగ్రికల్చర్ కాలేజీ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. వరంగల్ జిల్లా అభివృద్ధికి స్పెషల్ డెవలప్మెంట్ అథారిటీ వేస్తామన్నారు.
తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరం వరంగల్ అని, హైదరాబాద్ జనాలతో కిక్కిరిసిపోయిందని, కాబట్టి ఓరుగల్లును విద్యాహబ్గా చేస్తామన్నారు. వరంగల్ జిల్లాకు ఏటా రూ.300 కోట్లు కేటాయిస్తున్నామన్నారు.
కోరుకొండ స్థాయి సైనిక్ స్కూల్ ఏర్పాటు కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. వరంగల్లో బహిరంగ మూత్రశాలలో కావాల్సినన్ని లేవని, వాటిని నిర్మిస్తామన్నారు. వరంగల్ జిల్లాకు నూతన కలెక్టరేట్ నిర్మిస్తామన్నారు. ఇప్పుడున్న కలెక్టరేట్ను కూల్చి అద్భుతమైన కాంప్లెక్స్ కడతామన్నారు.
వరంగల్ను గ్రేటర్ వరంగల్ కార్పోరేషన్గా చేస్తామన్నారు. దేశంలోనే అతిపెద్ద మల్టీలెవల్ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామన్నారు. టెక్స్టైల్ పార్కుతో పాటు టౌన్ షిప్ ఏర్పాటు చేస్తామన్నారు. ఓ మల్టీ స్పెషాల్టీ నిర్మిస్తామన్నారు.
ఇప్పుడున్న ఎంజీఎంను మహిళలకు, పిల్లలకు చేసి, ఓ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తామన్నారు. ఎంజీఎంను మామూనురుకు తరలిస్తామని, అక్కడ కాకతీయ మెడికల్ కాలేజీ కట్టి, దానిని ఎడ్యుకేషన్ హబ్గా చేస్తామన్నారు. వరంగల్ అద్భుత నగరం కావాలంటే అందరి సహకారం కావాలన్నారు.
వరంగల్లో చాలా భవనాలు కొత్తగా నిర్మిస్తామన్నారు. మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, ప్రభుత్వ భవనాలు, కలెక్టరేట్ తదితరాలను కొత్తగా నిర్మిస్తామన్నారు. ఓరుగల్లులో 12 అంతస్తులతో నగర పోలీసు కమిషనర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. పాత స్కూల్ భవనాలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేస్తామన్నారు.
వరంగల్లో మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజీ లేదని, దానిని నిర్మిస్తామన్నారు. వరంగల్ జిల్లాలో ఔటర్ రింగు రోడ్డును నిర్మిస్తామన్నారు. అండర్ వరల్డ్ డ్రెయిన్ కోసం కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుతో మాట్లాడానని చెప్పారు. వరంగల్లో అండర్ వరల్డ్ డ్రెయినేజీ త్వరలోనే తెస్తామన్నారు.
నగరంలో 20 ఆధునాతన మార్కెట్లు నిర్మిస్తామన్నారు. వరంగల్ రాబోయే మూడు నాలుగేళ్లలో స్లమ్ లెస్ సిటీగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మల్టీ స్టోరియెడ్ భవంతులు కడుతున్నామన్నారు. ఇందుకోసం పదిహేను రోజుల్లో పేదలు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఈ మధ్య వరంగల్ ప్రజలు (ఉప ఎన్నికల్లో పసునూరి దయాకర్ గెలుపు) మంచి తీర్పు ఇచ్చారని, కాబట్టి ప్రజలకు శుభవార్త చెబుతున్నామన్నారు. 30వేల ఇళ్లను మంజూరు చేస్తామన్నారు. తెలంగాణలోని మాజీ సైనికులు, వారి భార్యలకు ఆస్తి పన్ను మినహాయిస్తున్నట్లు చెప్పారు.
వరంగల్ జర్నలిస్టుల కోసం జర్నలిస్ట్ కాలనీ నిర్మిస్తామన్నారు. అయితే, వివిధ సంఘాలు అంటూ రావొద్దని, ఎవరో ఒకరు బాధ్యతను తీసుకోవాలన్నారు. జర్నలిస్టులు అంటే యాంకర్లు, రాసేవాళ్లు, ఫోటో జర్నలిస్టులు.. ఇలా అందరూ రావాలన్నారు. వరంగల్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామన్నారు.
హైదరాబాద్ జర్నలిస్టులు అసూయపడేలా వరంగల్లో జర్నలిస్ట్ కాలనీ కట్టిస్తామన్నారు. అందులో మల్టీప్లెక్స్, కూరగాయల మార్కెట్, పార్కు.. ఇలా అన్నీ రావాలన్నారు. భార్యల పేరు మీద కడుతామని చెప్పారు. వరంగల్ జిల్లాకు నేనే ఇక నుంచి ఇంచార్జ్ అని చెప్పారు. జర్నలిస్ట్ కాలనీని ఏడాదిలోగా ఇనాగరేషన్ చేసేలా ఉండాలన్నారు. జర్నలిస్టులు విభేదాలు మానితే చాలన్నారు. జర్నలిస్టులు బాగుండాలన్నారు.