చెన్నై వరదలు - హైదరాబాద్కూ ఓ పాఠం: తగ్గుతున్న మూసీ నది
హైదరాబాద్: తమిళనాడు రాజధాని చెన్నైలో భారీ వర్షం, వరదలు ముంచెత్తాయి. చెన్నై నగరం మొత్తం అస్తవ్యస్తంగా మారింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో అలాంటి వరదలు వస్తే పరిస్థితది ఏమిటి? అనే చర్చ కూడా సాగుతోంది.
ఇప్పటికే కొద్దిపాటి వర్షానికి హైదరాబాదులో లోతట్టు ప్రాంతాలు మునిగిన సందర్భాలు చాలా చూశాం. చెన్నైలాంటి వర్షం వస్తే హైదరాబాద్లో కూడా భారీగానే నష్టం జరుగుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. కాబట్టి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.
మూసీ నది ద్వారానే బయటకు
హైదరాబాద్ నగరంలో మూసీ నది ద్వారానే నీళ్లు బయటకు వెళ్లే అవకాశం ఉంది. హైదరాబాద్ క్రమంగా అభివృద్ధి చెందుతోంది. త్వరలో జనాభా కోటికి పెరగనుంది. నగరం రోజు రోజుకు పెద్దదవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ మధ్య నుంచి మురికి నీరు బయటకు పోయేందుకు మూసీ ఒక్కటే మార్గం.
అలాంటి మూసి నది వెడల్పు క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఇప్పటికే మూసీ నది రివర్ బెడ్ నలభై శాతం తగ్గింది. అందుకు ఆక్రమణలు ముఖ్య కారణం. మూసీని ఆనుకొని వేలాది ఇళ్లు ఉన్నాయి. మూసీ నది పాత బస్తీలో ఆరు అసెంబ్లీ స్థానాలు తాకుతూ వెళ్తుంది.
హైదరాబాదు నగరంలో 2000 సంవత్సరంలో భారీ వరదలు వచ్చాయి. మూసీ నదిని ఆక్రమించుకొని ఎన్ని నిర్మాణాలు వస్తున్నాయి. అలాగే, నగరంలో ఇరుకుగా ఎన్నో నిర్మాణాలు వస్తున్నాయి. అయితే, వీటి పైన ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం సంతృప్తికరమైన చర్యలు తీసుకోలేదని చెబుతున్నారు.
దాదాపు అరవై వేల అక్రమ ఇళ్లను ప్రభుత్వాలు 2008లో రెగ్యులర్ చేశాయి. అందులో మురికి కాలువలు, కాలువల పైన నిర్మించిన ఇళ్లు కూడా ఉండటం గమనార్హం. ఇలాగైతే చెన్నైలాంటి వర్షాలు వస్తే తీవ్ర నష్టం తప్పదని అభిప్రాయపడుతున్నారు.
అక్రమ నిర్మాణాల పైన టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా వాగ్ధానం చేసింది. కానీ ఆ తర్వాత యూ టర్న్ తీసుకుంది. తుమ్మిడికుంట చెరువును బఫర్ జోన్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారు. దీని పైన టిఆర్ఎస్ ప్రభుత్వం తొలుత హడావుడి చేసింది.