రాజయ్య నామినేషన్ తిరస్కరణ: 'అందుకే సర్వేని పెట్టాం, సారిక ఎఫెక్ట్ ఉండదు!'
హైదరాబాద్: వరంగల్ లోకసభ ఉప ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగిసింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య దాఖలు చేసిన నామినేషన్ను తిరస్కరించారు. రాజయ్య నామినేషన్ సహా స్వతంత్ర అభ్యర్థులు దాఖలు చేసిన తొమ్మిది అప్లికేషన్లను అధికారులు తిరస్కరించారు. 38 నామినేషన్లు రాగా వాటిని పరిశీలించారు.
అందుకే సర్వేను ప్రకటించాం: మల్లు రవి
అనూహ్య పరిణామాలతో వరంగల్ ఉప ఎన్నిక అభ్యర్థిగా సర్వే సత్యనారాయణను ప్రకటించామని కాంగ్రెస్ నేత మల్లు రవి గురువారం నాడు చెప్పారు. వరంగల్ ఉప ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్వే గెలుస్తారని చెప్పారు. తనకు గెలుస్తామనే పూర్తి నమ్మకం ఉందన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం అసహనంతో వ్యవహరిస్తోందన్నారు. ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు ఉండకూడదని ఈ ప్రభుత్వం భావిస్తోందని మండిపడ్డారు.
రాజయ్య ఇంట్లో జరిగిన ఘటన వల్ల తమ పార్టీకి ఎలాంటి నష్టం లేదని చెప్పారు. శుక్రవారం హన్మకొండ, పరకాలలో కాంగ్రెస్ నాయకులు ఇంటింటి ప్రచారం చేస్తారన్నారు. ఈ నెల 7న భూపాలపల్లి, వరంగల్ ఈస్ట్, వర్దన్నపేట నియోజకవర్గాల్లో ఇంటింటి ప్రచారం జరగనుందన్నారు.
ఎన్నికలు వచ్చినప్పుడల్లా టిఆర్ఎస్ కొత్త కథలను తెరపైకి తీసుకు వస్తుందని తెలంగాణ పీసీసీ అధికార ప్రతినిధి కొనగాల మహేష్ మండిపడ్డారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని పసునూరి దయాకర్ తయారు చేశారని మాయమాటలు చెబుతోందన్నారు.
బీజేపీ పార్లమెంటు అభ్యర్థి దేవయ్యకు వరంగల్ ఎల్లలు కూడా తెలియవన్నారు. అతనిని విదేశాల నుచి తీసుకొచ్చి వరంగల్ లోకసభ ఉప ఎన్నికల టికెట్ ఇచ్చారన్నారు. టిఆర్ఎస్, బిజెపి అభ్యర్థులతో పోలీస్తే సర్వే చాలా సమర్థుడన్నారు.