పదో తరగతి పేపర్లు ఇక ఆరే, విద్యాశాఖ కీలక నిర్ణయం
పదో తరగతి పరీక్షల విధానానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్యువల్ ఎగ్జామ్ ఇకపై ఆరు పేపర్లతో నిర్వహిస్తామని పాఠశాల విద్యా శాఖ సంచాలకులు శ్రీదేవసేన వెల్లడించారు. ఈ ఏడాది నుంచే ఆరు పేపర్ల నిబంధన అమల్లోకి వస్తుందని.. ఈ మేరకు జిల్లాల డీఈవోలు, విద్యా శాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు.
9, 10వ తరగతుల విద్యార్థులకు నిర్వహించే సమ్మెటివ్ అసెస్మెంట్-2(ఎస్ఏ-2) పరీక్షలు కూడా 6 పేపర్లతోనే నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటివరకు పదో తరగతిలో 11పేపర్లతో పరీక్షలు నిర్వహించారు. ద్వితీయ భాష మినహా ప్రథమ, తృతీయ భాష, గణితం, సామాన్య, సాంఘిక శాస్త్రాలు రెండు పేపర్లుగా విద్యార్థులు రాస్తున్నారు.
కొవిడ్ పరిస్థితుల వల్ల పూర్తిస్థాయి బోధన జరగకపోవడంతో గతేడాది ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించారు. 11 పేపర్లు రాయడం వల్ల విద్యార్థులపై భారం పడుతోందని.. 6 పేపర్లకు కుదించాలని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ(ఎస్సీఈఆర్టీ) విద్యా శాఖ ముందు ప్రతిపాదనలు ఉంచింది.
ఎస్సీఈఆర్టీ చేసిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన విద్యా శాఖ ఆరు పేపర్లకు కుదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, సామాన్య శాస్త్రం పరీక్షలో భౌతిక, జీవశాస్త్రాలకు వేర్వేరు సమాధాన పత్రాలు ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.