బాబుకు భయపడం: తలసాని, సెక్షన్ 8 రాసిందే కేసీఆర్: కొత్తకోట సంచలనం
హైదరాబాద్: సెక్షన్ 8 పేరుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న తాటాకు చప్పుళ్లకు తాము భయపడే ప్రసక్తి లేదని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం అన్నారు.
హైదరాబాద్లో సెక్షన్-8 అమలయ్యే పరిస్థితే రాదన్నారు. గవర్నర్కు విలువ ఇవ్వని వారు సెక్షన్-8 గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. ఓటుకు నోటు కేసులో నుంచి తప్పించుకోవడానికే సెక్షన్ -8 అంటూ రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు.
అభివృద్ధి చూసి ఓర్వలేకనే చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. హైదరాబాద్పై ఇతరుల పెత్తనం చేయాలని చూస్తే తెలంగాణ భగ్గుముంటుందన్నారు. తెలంగాణ శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని చెప్పారు.
ఇక్కడ అన్ని ప్రాంతాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, చంద్రబాబు కుట్రలకు తలవంచి కేంద్ర ప్రభుత్వం సెక్షన్-8 విధిస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామన్నారు. తెరాస ప్రభుత్వాన్ని అనవసరంగా ఇబ్బందులకు గురిచేస్తే తిరుగబడతామన్నారు. హైదరాబాదులోని ఏపీ ప్రజలు చంద్రబాబుకు బుద్ధి చెబుతారన్నారు. ఏపీలో సమస్యలు గాలికి వదిలి ఇక్కడ చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.
అందరికీ అండగా ఉంటాం: పోచారం
సెక్షన్ 8 అవసరం లేదని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమన్నారు. శాంతిభద్రతలను తెలంగాణ ప్రభుత్వమే చూసుకుంటుందని చెప్పారు. హైదరాబాదులోని అన్ని ప్రాంతాలు, వర్గాల వారికి అండగా ఉంటామన్నారు.
కేసీఆర్కు అప్పుడే చెప్పాం: కొత్తకోట సంచలనం
గతంలోనే సెక్షన్ 8 వద్దని టీడీపీ డిమాండ్ చేసినా కేసీఆర్ వినలేదని తెలంగాణ టీడీపీ నేత కొత్తకోట దయాకర్ రెడ్డి అన్నారు. విభజన చట్టం తానే రాశానని గతంలోనే కేసీఆర్ చెప్పారన్నారు. సెక్షన్ 8 కూడా ఆయన రాసిందేనని చెప్పారు. ఇప్పుడెందుకు రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు.
అంతర్గత ముప్పు వాటిల్లిందని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తోందని, ఓటుకు నోటు టేపులు రెండు చానళ్లలో ప్రసారం కావడమే ఇందుకు నిదర్శనమన్నారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని ఐజీ స్థాయి అధికారి, మే 23న చంద్రబాబుకు చెప్పారని, అప్పటి నుండే అంతర్గత విచారణ సాగుతోందన్నారు.