టాప్ మావోయిస్టు లీడర్ లొంగుబాటు: పోస్ట్మాన్ను చంపిన నక్సల్స్, మహిళా నక్సలైట్ అరెస్ట్
హైదరాబాద్: దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గాజర్ల అశోక్ అలియాస్ ఐతు సురేందర్ మంగళవారంనాడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. 24 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీలో పనిచేసిన అశోక్ అనారోగ్య కారణాలతో జనజీవన స్రవంతిలోకి వస్తున్నట్లు ప్రకటించాడు. దీంట్లో పోలీసుల ఒత్తిడి ఏమీ లేదని స్పష్టం చేశాడు.
పద్దెనిమిదేళ్ల వయస్సులోనే మావోయిస్టు పార్టీలో చేరిన అశోక్పై ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయి. ప్రజా వ్యతిరేక ఉద్యమాలు చేస్తున్న మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వరంగల్ రేంజ్ డీఐజీ మల్లారెడ్డి పిలుపునిచ్చారు.
అశోక్బాటలో మరికొంత మంది మావోయిస్టులు లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నారని మల్లారెడ్డి ప్రకటించారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ఆయన చెప్పారు. గాజర్ల అశోక్ది వరంగల్ జిల్లా చిట్యాల మండలం వెలిశాల గ్రామం.
పోస్ట్మ్యాన్ను చంపిన నక్సలైట్లు
గత వారం రోజుల కింద అపహరించుకుపోయిన పోస్ట్మాన్ను నక్సల్స్ హతమార్చారు. దంతెవాడ జిల్లా కువకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని పరియ గ్రామానికి చెందిన సుజిత్ పొడియంను నక్సలైట్లు గత వారం వారంతపు సంత నుంచి అపహరించుకు పోయారు.
అయితే పోస్ట్మాన్ను అపహరించుకు పోయిన ప్రాంతంలోనే నిన్న సాయంత్రం మృతదేహం పడి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నక్సల్స్ హతమార్చిన పోస్ట్మాన్కు పోలీసులకు ఎలాంటి సంబంధంలేదని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. హంతకుల కోసం గాలింపు చేపట్టామని వెల్లడించారు.
మహిళ నక్సలైట్ అరెస్టు
ఛత్తీస్గఢ్లో కాంఖేర్ జిల్లాలో మంగోతి కొర్రం అనే మహిళ నక్సలైట్ను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారంనాడు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో, రాష్ట్ర పోలీసులు సంయుక్తంగా జరిపిన సోదాల్లో భాగంగా ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టయిన మహిళ నక్సలైట్కు గత పంచాయతి ఎన్నికల సందర్భంగా జరిగిన పలు హత్యలు, హింసాత్మక సంఘటనలతోపాటు సంబంధాలున్నాయని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. నిందితురాలిని సీపీఐ మావోయిస్టు పార్టీ కిస్కోడో స్థానిక దళ సభ్యురాలిగా చెప్పారు.