భవిష్యత్పై బెంగ: ఫిరాయింపులతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో అభద్రతాభావం.. ఇన్చార్జీల్లో ఆందోళన
నిత్యం ప్రజలతో మమేకమైనా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ లభిస్తుందా? లేదా? అని అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో సందిగ్ధత నెలకొంది.
హైదరాబాద్: 'ప్రజల్లోకి వెళ్లి పనిచేయండి.. ప్రజలకు దగ్గరగా ఉండండి. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇస్తా. పనితీరు మెరుగుపరుచుకుంటే ఏ సమస్యా రాదు. పని చేసి పేరుతెచ్చుకుంటే చాలు.. అందరికీ టికెట్లు వస్తాయి'అని టీఆర్ఎస్ అధినేత, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇటీవల టీఆర్ఎస్ఎల్పీ సమావేశాల్లో ఒకటికి రెండు సార్లు చేసిన ప్రకటన ఇది. 2019లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై సీఎం కేసీఆర్ ప్రకటనలో భరోసా కనిపిస్తున్నా కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు అయోమయానికి గురవుతున్నారు. టీఆర్ఎస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో అభద్రతా భావం కనిపిస్తోందని అంటున్నారు. అందరికీ టిక్కెట్లు ఇస్తామని మరోవైపు విపక్షాల నుంచి నేతల చేరికలకు స్వాగతం పలుకుతుండటంతో కొందరు ఎమ్మెల్యేలు, ఇన్ చార్జీల్లో ఆందోళన మొదలైంది.
ఇన్చార్జీ బాధ్యతల అప్పగింతతో ఇలా
పదే పదే సిట్టింగ్ ఎమ్మెల్యేలకే అవకాశం ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటిస్తున్నా.. అధికార టీఆర్ఎస్లో పరిణామాలతో వారు స్థిమితంగా ఉండలేక పోతున్నారు. వివిధ నియోజకవర్గాల్లో తమ ఎమ్మెల్యేలు ఉండగా ఆయా పార్టీల నుంచి గతంలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారిని ఇప్పటికే పార్టీలో చేర్చుకున్నారు. ఇటీవల కొద్ది రోజులుగా మరికొందరిని తీసుకుని నియోజకవర్గ ఇన్చార్జీల బాధ్యతలూ అప్పజెప్పారు. కాగా, ఒకటీ రెండు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో అవకాశం ఉండదని, మరో రూపంలో అవకాశం కల్పిస్తామని వారికి హామీ కూడా ఇచ్చారని సమాచారం.
రేఖానాయక్, రమేశ్ రాథోడ్ మధ్య పొసగని సయోధ్య
ఈ ఉదంతాలతో సహజంగానే కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మహబూబాబాద్లో పార్టీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఉండగానే, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కవితను చేర్చుకున్నారు. ఆమె పార్టీలో చేరి రెండేళ్లవుతుండగా, ఇటీవల పార్టీ, అధికార కార్యక్రమాల్లో ఆమె దూకుడు పెంచారని, ఆమెకే ప్రాధాన్యం లభిస్తోందని అంటున్నారు. మరో వైపు ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఉండగా, టీడీపీ నుంచి మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ను చేర్చుకున్నారు. వీరి మధ్య పొసగకపోగా గులాబీ శ్రేణులు చీలిపోయాయి.
దుబ్బాకకు బదులు కంచర్లకు ఇన్చార్జీ బాధ్యతలు
తాజాగా భూపాలపల్లిలో స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ఉండగా, టీడీపీకి చెందిన గండ్ర సత్యనారాయణరావును చేర్చుకున్నారు.వచ్చే ఎన్నికల్లో టికెట్ హామీ మీదనే ఆయన చేరారని, ఇపుడు ఆ నియోజకవర్గంలో గ్రూపు రాజకీయం బలపడిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. నల్లగొండలో దుబ్బాక నర్సింహారెడ్డి ఇన్చార్జిగా ఉండగా, టీడీపీకి చెందిన కంచర్ల భూపాల్రెడ్డిని చేర్చుకుని నియోజకవర్గ ఇన్చార్జిగా ప్రకటించారు.
మునుగోడులో కూసుకుంట్ల, కర్నె మధ్య ఆధిపత్య పోరు
దీనికి తోడు మెజారిటీ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సొంత పార్టీ నేతలతోనే తలనొప్పులు మొదలయ్యాయి. తొలి ఏడాదికంటే తన పనితీరుతో సీఎం సర్వేల్లో గ్రాఫ్ పెంచుకున్న తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్కుమార్కు గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేలుతో కొత్త తలనొప్పులు తలెత్తాయి. మునుగోడులో ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది.
చెన్నూరులో ఓదెలు వర్సెస్ వినోద్
ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో ఎమ్మెల్యే చెన్నయ్య ఉండగా, పార్టీ ఎంపీ బాల్క సుమన్ అక్కడ దృష్టిపెట్టారని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి పార్టీ అభ్యర్థిగా జీ వివేకానంద పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో బాల్క సుమన్ అసెంబ్లీకి పోటీ చేసేందుకు సేఫ్ ప్లేస్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. చెన్నూరులో ప్రభుత్వ విప్ ఓదెలు ఉండగా మాజీ మంత్రి జీ వినోద్ ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలుస్తోంది. చెన్నూర్ నుంచి మాజీ మంత్రి బోడ జనార్ధన్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు.
గువ్వల బాలరాజుకు టిక్కెట్ అనుమానమేనా?
వేములవాడలో చెన్నమనేని రమేశ్ ఉండగా, పార్టీ ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ అక్కడి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే పౌరసత్వం సమస్య చెన్నమనేని రమేశ్ బాబుకు ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉన్నాయి. అచ్చంపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఉండగా, మాజీ మంత్రి పీ రాములు పార్టీలో చేరారు. ఈ పరిణామాలన్నీ సిట్టింగ్లకు ఆందోళన కలిగించే పరిణామాలేనని చెప్తున్నారు. అందోల్లో బాబూమోహన్ ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఇటీవల స్థానిక నినాదం తెరపైకి రావడంతో ఆయన వివరణ ఇచ్చుకున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జులు ఉన్న నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నాయకులకు ఆహ్వానాలు అందుతున్నాయని చెబుతున్నారు.