'ఆపరేషన్ పాలమూరు': రేవంత్ ఇలాకా చిక్కేనా? డికె అరుణా టార్గెట్
హైదరాబాద్: అధికార తెలంగాణ రాష్ట్ర సమితి కొడంగల్ నియోజకవర్గం పైన ప్రత్యేక దృష్టి సారించినట్లుగా కనిపిస్తోంది. ఓటుకు నోటు కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కొడంగల్లో ఉప ఎన్నికలు జరిగే అవకాశాలు కొట్టి పారేయలేం.
ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ అప్పుడే రేవంత్ కంచుకోట అయిన కొడంగల్ పైన దృష్టి పెట్టినట్లుగా కనిపిస్తోంది. ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉండటంతో.. రేవంత్ రెడ్డి రాజీనామా చేసి తన సత్తా చాటుకోవడం లేదా కేసులో దోషిగా తేలితే ఈసి ఆయన పైన వేటు వేయడం.. ఇలా ఏదైనా జరిగే అవకాశాలు కొట్టిపారేయలేం.
ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ ప్రత్యేక దృష్టి సారించినట్లుగా కనిపిస్తోంది. దానికి పాలమూరు ప్రాజెక్టును మహదావకాశంగా ఉపయోగించుకుంటోందని అంటున్నారు. సోమవారం నాడు కొడంగల్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు కారు ఎక్కారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, లక్ష్మా రెడ్డి, జూపల్లి కృష్ణా రావు, జిల్లాకు చెందిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వారి నోట పదేపదే కొడంగల్, చంద్రబాబు పేరు వినిపించింది. రేవంత్ రెడ్డి కొడంగల్కు చెడ్డపేరు తెచ్చారని వారు ఆరోపించారు.
కొడంగల్లో రేవంత్ రెడ్డికి గట్టి పట్టు ఉంది. అలాంటి రేవంత్ చంద్రబాబుకు గట్టి మద్దతుదారుగా ఉన్నారు. చంద్రబాబు హయాంలోనే తెలంగాణలో, పాలమూరులో ఎక్కువ ప్రాజెక్టులు వచ్చాయని రేవంత్, రావుల చంద్రశేఖర రెడ్డి వంటి టిడిపి నేతలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు.
పాలమూరు ఎంపీగా ఉన్న కెసిఆర్ నాడు మహబూబ్ నగర్ జిల్లాకు చేసిందేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో పాలమూరును దత్తత తీసుకున్న చంద్రబాబు ఏం చేయలేదని టిఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. పాలమూరు ప్రాజెక్టుల పైన కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ కూడా ఘాటుగానే స్పందించారు.
టిడిపి, కాంగ్రెస్ పార్టీలకు ప్రాజెక్టుల పైన మాట్లాడే హక్కు లేదని ఆమె నిలదీశారు. పాలమూరు ఎత్తిపోతలకు వ్యతిరేకంగా చంద్రబాబు కేంద్ర జలవనరుల సంఘానికి లేఖ రాశారని టిఆర్ఎస్ చెబుతుండగా, రాయలేదని టిడిపి నేతలు చెబుతున్నారు. ఇటీవలి వరకు దీని పైన టిఆర్ఎస్, టిడిపి, కాంగ్రెస్ పార్టీలు సవాళ్లు విసురుకున్నాయి.
ఇప్పుడు, అదే పాలమూరు ప్రాజెక్టు ఆయుధంగా టిఆర్ఎస్ పాలమూరులో ఆపరేషన్ ఆకర్ష్ను తెర పైకి తెచ్చినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. ఈ ప్రాజెక్టును చంద్రబాబును అడ్డుకుంటున్నారని, దీని కోసం ఒక్కటవుదామని టిఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.
పాలమూరు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చంద్రబాబు లేఖ రాయలేదని టిడిపి చెబుతున్నప్పటికీ.. టీఆర్ఎస్ మాత్రం దానినే ఆయుధంగా పాలమూరులో దూసుకెళ్లే ప్రయత్నాలు చేస్తోన్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.
ముఖ్యంగా, చంద్రబాబుకు గట్టి మద్దతుదారుగా ఉన్న రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ పైన టిఆర్ఎస్ దృష్టి సారించిందని అంటున్నారు. మంత్రి హరీష్ రావు సహా ఇతర నేతలు సోమవారం నాటి ఇతర పార్టీల నేతల చేరిక సమయంలో కొడంగల్ పేరును పలుమార్లు పలవరించారు.
జిల్లాలో, రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే డికె అరుణను కూడా టిఆర్ఎస్ టార్గెట్ చేసుకుందని చెప్పవచ్చు. హరీష్ రావు ఈ మాజీ మంత్రి పైన సోమవారం నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ హయాంలో పాలమూరు నీటిని అనంతపురం తరలిస్తుంటే డికె అరుణ హారతి పట్టారని, అలాంటి నేతలు మనకు అవసరం లేదని ధ్వజమెత్తారు.
మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి డికె అరుణ, టిడిపికి రేవంత్ రెడ్డి పెద్ద దిక్కుగా ఉన్నారు. వారిద్దర్నీ ప్రధానంగా టిఆర్ఎస్ టార్గెట్ చేసుకుంది. పాలమూరు ఎత్తిపోతల వస్తే జిల్లాలో అన్నింటి కంటే ఎక్కువగా కొడంగల్ నియోజకవర్గానికే లాభమని, నియోజకవర్గ ప్రజలు ఒక్కటవుతే ఎవరూ ఏం చేయలేరని టిఆర్ఎస్ నేతలు చెప్పారు. తద్వారా కొడంగల్ను రేవంత్ రెడ్డి చేతి నుండి చేజిక్కించుకునే ప్రయత్నాలు చేస్తోన్నారంటున్నారు.