త్వరలోనే నిరుద్యోగ భృతి, కేసీఆర్ ప్రకటిస్తారంటూ తీపి కబురు చెప్పిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భావానికి ముందు గృహిణి నుంచి మొదలు పారిశ్రామికవేత్తల వరకు విద్యుత్ కష్టాలంటే ఏంటో ప్రతి ఒక్కరికీ తెలుసని కేటీఆర్ అన్నారు. దీన్ని సవాల్ తీసుకుని.. టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే మొదట విద్యుత్ సమస్యనే పరిష్కరించామని చెప్పారు. ఇదంతా విద్యుత్ కార్మికుల కఠోర శ్రమ వల్లే సాధ్యమైందన్నారు.
దేశంలోనే తెలంగాణ అగ్రస్థానం..
గురువారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం(టీఆర్వీకేఎస్) సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఇప్పుడు విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని చెప్పారు. సాగుకు 24 గంటల నిరంతర విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందని తెలిపారు.
ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా తమ రాష్ట్రంలో కరెంట్ పోవట్లేదని ప్రజలు గర్వంగా చెప్పుకుంటున్నారన్నారు. తాగునీటి సమస్యలు కూడా తమ ప్రభుత్వం పరిష్కరించిందని మంత్రి తెలిపారు. సాగునీటి కష్టాల పరిష్కారంతో దేశానికే ధాన్యాగారంగా తెలంగాణ మారిందని కేటీఆర్ చెప్పారు.
లక్షా 31వేల ఉద్యోగాలిచ్చాం..
ఈ ప్రభుత్వం.. మీ ప్రభుత్వం.. మన ప్రభుత్వం ప్రజలు అడిగినదానికంటే సీఎం ఎక్కువే చేశారన్నారు కేటీఆర్. ఆర్టిజన్స్ ఉద్యోగులను ప్రభుత్వం రెగ్యులర్ చేసిందన్నారు. ఇప్పటివరకు టీఎస్పీఎస్సీ ద్వారా 39వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలైన జెన్ కో, ట్రాన్స్ కో, సింగరేణి ద్వారా మరిన్ని ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పుకొచ్చారు. ఇలా అన్ని రంగాల్లో కలిపి 1.31 లక్షల ఉద్యోగాలను కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు.
త్వరలోనే నిరుద్యోగ భృతి..
త్వరలోనే నిరుద్యోగ భృతి వస్తుందంటూ తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు తీపికబురు చెప్పారు మంత్రి కేటీఆర్. దీనిపై ఒకటి రెండ్రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటిస్తారని తెలిపారు. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ బిడ్డలను కేసీఆర్ సర్కారు తీర్చిదిద్దుతోందన్నారు. ఉద్యోగులకు అక్కడక్కడా ఉన్న చిన్నపాటి సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇష్టానుసారం మాట్లాడుతున్న ప్రతిపక్షాల నేతలు ఇవన్నీ గమనించాలన్నారు. కేసీఆర్ తెలంగాణ తేవడం వల్లే టీపీసీసీ, టీ బీజేపీ అధ్యక్ష పదవులు ఏర్పడ్డాయని చెప్పుకొచ్చారు మంత్రి కేటీఆర్. ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడితే ప్రజలు తిప్పికొట్టాలన్నారు.