టీఎస్ఆర్టీసీ సమ్మె... సునిల్ శర్మ అఫిడవిట్పై ఫైర్ అయిన ఉత్తమ్
ఆర్టీసీ సమ్మెను అడ్డం పెట్టుకుని ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రతిపక్ష పార్టీలు కుట్ర చేస్తున్నాయని ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ సునిల్ శర్మ కోర్టులో వేసిన అఫిడవిట్పై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆయన వేసిన అఫిడవిట్పై ఆయన తీవ్ర అభ్యంతంరం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ఎవరు కూల్చుతున్నారో చెప్పాలని... ఆధారాలు ఉంటే బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆర్టీసీ సమ్మెపై సునిల్ శర్మ అఫిడవిట్ , ప్రభుత్వ కూల్చివేతకు కుట్ర
ఆర్టీసీ సమ్మెపై ఇంచార్జ్ ఎండీ సునిల్ శర్మ శనివారం మరో అఫిడవిట్ ధాఖలు చేశారు. అఫిడవిట్లో ప్రధానంగా ఆర్టీసీని సమ్మెను అడ్డం పెట్టుకుని ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నారని ఆయన పేర్కోన్నారు. సమ్మె వల్ల ప్రజలతో పాటు ప్రభుత్వం కూడ ఇబ్బంది పడుతుందని కోర్టుకు తెలిపారు. నలబై రోజులుగా చేస్తున్న సమ్మె వల్ల రాష్ట్ర అభివృద్ది అగిపోతున్న నేపథ్యంలో త్వరగా ఆదేశాలు జారీ చేయాలని అఫిడవిట్లో కోరాడు.
కోర్టు సుమోటా స్వీకరించి విచారణ చేపట్టాలి
దీంతో ఐఏఎస్ అధికారులు ప్రతిపక్షాల గురించి పేర్కోనడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. తాము ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ఎలాంటీ ఆలోచన చేయలేదని పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సునిల్ శర్మ కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్ను విచారించి సుమోటాగా స్వీకరించాలని చర్యలు చేపట్టాలని కోర్టును కోరారు. పార్టీ సీనియర్ నేతలు హనుమంతరావు, మరియు పొన్నం ప్రభాకర్లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
కుట్ర చేస్తే అరెస్ట్ చేయండి
కాగా అధికారిగా ఉన్న సునిల్ శర్మ ఎవరి ప్రోద్బలంతో ఈ అఫిడవిట్ను వేశారో వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రతిపక్ష పార్టీలు కుట్రలు పన్నినట్టు ఆధారాలు ఉంటే వెంటనే వారిని అరెస్ట్ చేయాలని అన్నారు. లేదంటే... అఫిడవిట్ వేసిన సునిల్శర్మనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక ముఖ్యమంత్రే కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలని చూశారని ఆయన ఆరోపణలు చేశారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వంత జాగీర్లాగా భావిస్తున్నారని అన్నారు. ఇక ఆర్టీసీ సమస్యను లోక్సభలో లేవనెత్తడంతోపాటు సునిల్ శర్మ వేసిన అఫిడవిట్ పై డీవోపీటీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.