కేసీఆర్ పైన టీ-టీడీపీ నిప్పులు, నాయిని కౌంటర్
కరీంనగర్/అదిలాబాద్: ఇతర పార్టీ వారికి ఎరవేసి ఎమ్మెల్యేల సంఖ్యను పెంచుకుంటే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఆగవని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కేసీఆర్ ప్రభుత్వం పైన ఆదివారం మండిపడ్డారు. ఆదివారం కరీంనగర్, అదిలాబాద్ జిల్లాల్లో వారి బస్సుయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ఎర్రబెల్లి, రేవంత్ తదితరులు మాట్లాడారు.
టీడీపీ పైన విమర్శలు మానుకొని మార్కెట్ యార్డులను సందర్శించాలని, రైతులకు న్యాయం చేసే విధంగా చూడాలని మంత్రి హరీష్ రావుకు హితవు పలికారు. తెలంగాణలో ఇప్పటి దాకా 238 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని, అందులో కరీంనగర్ జిల్లాకు చెందిన వారే 33 మంది ఉన్నారన్నారు.
ఈ నెల 18, 19 తేదీల్లో ఢిల్లీకి వెళ్లి తాము రైతు సమస్యలను ప్రధానికి వివరిస్తామన్నారు. తెరాస నుండి 63 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారని, మంత్రి పదవులకు వారు అర్హులు కానందునవల్లే తమ పార్టీ వారికి ఎరవేస్తున్నార్నారు. తెరాస అధికారంలోకి వచ్చి నాలుగు నెలల్లోనే బంగారు తెలంగాణ కావాలని కోరడం లేదని, అయితే అన్నదాతల ఆత్మహత్యలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
ఛత్తీస్ఘడ్ నుండి విద్యుత్తు లైన్ ఏర్పాటు చేసే కాంట్రాక్టును సీఎం తమ బంధువులకు ఇవ్వాలనుకోగా, ప్రయివేటు గుత్తేదారులకు అటవీ శాఖ నుండి అనుమతులు రావని, పనులను నేషనల్ గ్రిడ్ కార్పోరేషన్కు అప్పగించాలని సూచిస్తే వారిని బదలీ చేశారన్నారు. త్వరలో ఈ వ్యవహారానికి సంబంధించి కీలక పత్రాలు బయటపెడతామన్నారు.
ప్రతికూల వాతావరణ పరిస్థితులు, విద్యుత్ కోతలతో సతమతమవుతున్న రైతులకు అండగా నిలిచేందుకే తాము బస్సుయాత్ర చేపట్టామన్నారు. ఎన్నికలకు ముందు ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసి రైతులకు సరఫరా చేస్తామని కేసీఆర్ చెప్పారన్నారు. ప్రస్తుతం నక్సల్స్ భయంతో విద్యుత్ లైన్ వేయడం లేదని ఆయన మంత్రి వర్గ సహచరుడు ఈటెల రాజేందర్ అంటున్నారన్నారు.
రైతులకు అండదండగా తాము ఉన్నామనే భరోసాను కల్పించడం కోసమే బస్సుయాత్రన్నారు. బంగారు తెలంగాణ సాధిస్తామని చెప్పి బంగారం లాంటి పంటలు పండించే రైతులను టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. రైతులకు గిట్టుబాటులను కల్పించాల్సిన ప్రభుత్వం గతంలో ఉన్న మద్దతు ధరలను కూడా తగ్గించి రైతులకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు.
తెలంగాణలో ఏడు గంటలపాటు విద్యుత్ను అందజేస్తానని, లక్ష రూపాయల రుణాన్ని మాఫీ చేస్తానని, మూడు ఎకరాల భూమి ఇస్తానని, రెండు బెడ్రూంల ఇళ్లు కట్టిస్తానని అనేక హామీలు గుప్పించిన ముఖ్యమంత్రి ఒక్కడి కూడా నెరవేర్చడం లేదన్నారు. కరువు కాలంలో రైతులకు అండగా నిలవల్సిన ప్రభుత్వం గుదిబండగా తయారైందని, త్వరలో ప్రజ ఆగ్రహానికి కేసీఆర్ గురికాక తప్పదన్నారు.
విహారయాత్ర: నాయిని
తెలంగాణ టీడీపీ నేతలది బస్సుయాత్ర కాదని విహారయాత్ర అని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి హైదరాబాదులో ఎద్దేవా చేశారు. ఎవరిని ఉద్దేశఇచి వారు బస్సుయాత్ర చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.