టిఆర్ఎస్లో చేరాలి, కెసిఆర్కు భజన, రాష్ట్రపతికి ఫిర్యాదు: గవర్నర్పై కాంగ్రెస్ నేతల విమర్శలు
హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్పై కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టిఆర్ఎస్ ప్రభుత్వానికి గవర్నర్ భజన చేస్తున్నాడని దుయ్యబట్టారు.రాజకీయాల్లో చేరాలనుకొంటే టిఆర్ఎస్లో చేరాలని గవర్నర్కు సలహ ఇచ్చారు. గవర్నర్ తీరుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీ నేతలు మల్లు భట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, వి. హనుమంతరావు తదితరులు గవర్నర్ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు.కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన తర్వాత గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ కెసిఆర్ ను ప్రశంసలతో ముంచెత్తారు.
కెసిఆర్తో పాటు, మంత్రి హరీష్రావును కూడ శనివారం నాడు గవర్నర్ నరసింహన్ ప్రశంసలతో ముంచెత్తడంపై కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. గవర్నర్ తన పదవిని కళంకం తెస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు
టిఆర్ఎస్ ఏజంట్గా గవర్నర్ మాటలు
కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన తర్వాత గవర్నర్ నరసింహన్ చేసిన వ్యాఖ్యలపై సిఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయ భిక్ష కోసమే గవర్నర్ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్వాపరాలను తెలుసుకోకుండా గవర్నర్ ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. రాజకీయాల పట్ల ఆసక్తి, కేసీఆర్పై విశ్వాసం ఉంటే గవర్నర్ నరసింహన్ టీఆర్ఎస్ పార్టీలో చేరాలని అన్నారు. శనివారం కాళేశ్వరం ప్రాజెక్టును ఉద్దేశించి నరసింహన్ చేసిన వ్యాఖ్యలు గవర్నర్ హోదాను కించపరిచేలా ఉన్నాయని అన్నారు.
రాష్ట్రపతికి గవర్నర్పై ఫిర్యాదు చేస్తాం
రాష్ట్ర గవర్నర్ నరసింహన్ వ్యవహరిస్తున్న తీరుపై రాష్ట్రపతి రామ్నాద్ కోవింద్కు ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. గవర్నర్ మాట్లాడిన మాటలను మల్లు భట్టి విక్రమార్క తప్పుబట్టారు. టిఆర్ఎస్కు అనుకూలంగా గవర్నర్ మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు.
ప్రభుత్వ అవినీతిలో గవర్నర్ కు భాగస్వామ్యం
ప్రభుత్వ అవినీతిలో గవర్నర్ కు భాగస్వామ్యం ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు ఆరోపించారు. రాజ్ భవన్, గవర్నర్ పదవిని నరసింహన్ కించపరుస్తున్నారని వి. హనుమంతరావు అభిప్రాయపడ్డారు.ప్రాణహిత చేవేళ్ళ ప్రాజెక్టు పేరు ఎందుకు మారింది, ప్రాజెక్టు అంచనా వ్యయం ఎందుకు పెరిగిందో గవర్నర్ ఎందుకు ప్రశ్నించలేదని వి. హనుమంతరావు ప్రశ్నించారు.
గవర్నర్ ను విడిచిపెట్టం
గవర్నర్ వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు టిఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్కు భజన శాఖను కేటాయించాలని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సూచించారు.గవర్నర్ పదవిని నరసింహన్ కించపరుస్తున్నారని ఆయన ఆరోపించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను మంత్రులుగా ప్రమాణం చేసిన రోజునే రాజ్ భవన్ ప్రతిష్ట మంటగలిసిపోయిందని పొన్నం ఆరోపించారు.