ఇక తిరుపతి లడ్డూలు కాగితపు పెట్టెల్లో, జనపనార సంచుల్లోనే!: ఎందుకంటే..?
తిరుపతి: తిరుమలలో పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ నిషేధానికి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తక్షణ చర్యలు ప్రారంభించింది. ఇక లడ్డూల కోసం కాగితం పెట్టెలు, జనపనార సంచులు ప్రవేశపెట్టింది. వీటితోపాటు తిరుమల కొండపై పేపర్ కప్పులు కూడా వినియోగంలోకి తీసుకొస్తోంది.
తిరుమలలో అన్ని అతిథి గృహాల్లో నీటి శుద్ది యంత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. సంక్రాంతిలోగా దశలవారీగా ప్లాస్టిక్ నిషేధించేందుకు టీటీడీ ప్రణాళికలు సిద్ధం చేసింది.
టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం మేరకు తిరుమలను మూడు దశల్లో ప్లాస్టిక్ రహితంగా మారుస్తామని, ఇందుకోసం పటిష్టమైన ప్రణాళికలు రూపొందించామని టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం సీనియర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
సమావేశం అనంతరం అదనపు ఈవో మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలలోని అన్ని టిటిడి కార్యాలయాల్లో వారంలోపు ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను పూర్తిగా నిషేధించి జలప్రసాదం నీటిని స్వీకరించాలని సూచించామని, ఈ మేరకు ఆయా విభాగాల అధికారులు ధ్రువీకరణ పంపుతారని తెలిపారు. అన్ని విశ్రాంతి గృహాలకు 15 రోజుల్లో జలప్రసాదం నీటిని సరఫరా చేసి ప్లాస్టిక్ బాటిళ్ల నిషేధంపై భక్తులకు అవగాహన కల్పిస్తామన్నారు. గదుల్లో భక్తులు నీటిని తాగేందుకు వీలుగా జగ్గులు, కాగితం గ్లాసులు అందుబాటులో ఉంచుతామని చెప్పారు.
టిటిడి ఆరోగ్యశాఖాధికారి ఆధ్వర్యంలో 15 రోజుల్లో అన్ని హోటళ్లు, అల్పాహారశాలల యజమానులతో సమావేశం నిర్వహించి ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల వాడకాన్నిపూర్తిగా నిలిపివేయాలని కోరతామన్నారు. ఒక నెల తరువాత తిరుమలకు ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల సరఫరాకు సంబంధించి లైసెన్సును రద్దు చేస్తామని, అలిపిరి చెక్పాయింట్ వద్ద తనిఖీలు నిర్వహించే సమయంలో ప్లాస్టిక్ బాటిళ్లు తిరుమలకు తీసుకెళ్లకూడదని భక్తులకు అవగాహన కల్పిస్తామని వివరించారు.
తిరుమలలో 15 రోజుల క్రితం 23 మంది లడ్డూ దళారులను భద్రతా సిబ్బంది గుర్తించారని అదనపు ఈవో తెలిపారు. ఈ క్రమంలో లడ్డూ టోకెన్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు రెండంచెల స్కానింగ్ విధానాన్ని 30 రోజుల్లో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.