ఇక్కడే ఉన్నాం.. ఇక్కడే ఉంటాం, మా రంగు వేరు కావొచ్చు కానీ: తానా
వాషింగ్టన్: కన్సాస్ సిటీలో ఇద్దరు తెలుగు ఇంజినీర్ల పైన కాల్పులు జరిగాయి. ఇందులో శ్రీనివాస్ కూచిభొట్ల కన్నుముశారు. ఈ ఘటన ఈ నెల 21వ తేదీన రాత్రి ఏడుంపావుకు బార్లో చోటు చేసుకుంది. మరో ఇంజినీర్ అలోక్ రెడ్డి తీవ్రగాయాలపాలయ్యాడు.
బార్లో ఉన్న కస్టమర్ ఇయాన్ గ్రిల్లెట్ ఈ ఘటనలో జోక్యం చేసుకున్నాడు. తెలుగు ఇంజినీర్లను కాపాడపోయిన గ్రిల్లెట్ గాయపడ్డాడు. ప్రస్తుతం నిందితుడు జైలులో ఉన్నాడు. అతనికి శిక్ష విధించాల్సి ఉంది.
కాల్పులు జరిపే ముందు నిందితుడు తెలుగు ఇంజినీర్లను ఉద్దేశించి.. 'మా దేశం నుంచి వెళ్లిపోండి' అని వ్యాఖ్యానించాడని తెలుస్తోంది. ఆ తర్వాత అతను కాల్పులు జరిపాడు. ఆ తర్వాత తాను ఇద్దరు మిడిల్ ఈస్టర్న్ వ్యక్తులను చంపినట్లు బార్ టెండర్కు చెప్పాడు.
అలోక్ రెడ్డి, ఇయాన్ గ్రిల్లెట్ ప్రాణాపయం నుంచి బయటపడ్డారు. అందుకు సంతోషం. అలోక్ రెడ్డి కాలుకు గాయమైంది. అతను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అతను కోలుకుంటున్నాడు.
తెలుగు ఇంజినీర్ల పైన దాడిని అడ్డుకోబోయిన ఇయాన్ గ్రిల్లెట్ ఎడమ చేతికి, ఛాతికి గాయాలయ్యాయి. అతను ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు.
ఈ కాల్పుల విషయం తెలిసిన వెంటనే కన్సాస్ సిటీ 'తానా' కో ఆర్డినేటర్ బిందు చీడెల్ల, ఆమె భర్త రాజ్ చీడెల్ల, ఇతర 'తానా' వాలంటీర్లు శ్రీనివాస్ కూచిభొట్ల, అలోక్ రెడ్డి మాదసాని కుటుంబ సభ్యులను, స్నేహితులను కలిశారు. వారికి వివిధ రకాలుగా సాయం చేశారు.
అంజయ్య చౌదరి లావు, అశోక్ బాబు కొల్ల, మోహన్ నన్నపనేని తదితరుల నేతృత్వంలో 'తానా' టీమ్ స్క్వేర్ వాలంటీర్లు అందరితో మాట్లాడి శ్రీనివాస్ కూచిభొట్ల మృతదేహం హైదరాబాద్ తరలించేందుకు సహకరించారు.
ఆ తర్వాత వి చౌదరి జంపాలా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా - ఇన్ఫో@తానా, ప్రెసిడెంట్).. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సతీష్ వేమనతో కలిసి అలోక్ రెడ్డిని, గ్రిల్లట్ను కలిశారు. అలాగే స్థానికంగా ఉన్న తెలుగు వారిని కలుసుకున్నారు. అలాగే, స్థానిక ఇండియన్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో జరిగిన పీస్ ర్యాలీలో పాల్గొన్నారు.
'తానా' మాజీ అధ్యక్షులు మోహన్ నన్నపనేని కూడా కూచిభొట్ల శ్రీనివాస్ కుటుంబ సభ్యులను కలిశారు.
పీస్ మార్చ్లో దాదాపు 1500 మంది పాల్గొన్నారు. అక్కడ హిందూ, క్రిస్టియన్, ముస్లీం, సిక్కు తదితర మతాల ప్రార్థనలు చేశారు. కొవ్వొత్తులు వెలిగించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మేయర్, పోలీస్ చీఫ్, స్టేట్ సెనేటర్, యూఎస్ కాంగ్రెస్మాన్, లెఫ్టినెంట్ గవర్నర్ పాల్గొన్నారు.
కాల్పుల్లో గాయపడిన అలోక్ రెడ్డి పీస్ ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. ఈ కాల్పులు ఓ వ్యక్తి చేసిన నేరం అని, కన్సాస్ స్ఫూర్తిని ఎవరూ దెబ్బతీయలేరని వ్యాఖ్యానించారు.
నేను (చౌదరి జంపాల), సతీష్ వేమన కాల్పుల సమయంలో అడ్డుకోబోయిన గిల్లెట్ను కలిశాం. అతనిని, అతని కుటుంబ సభ్యులను కలిశాం. తెలుగు ప్రజల తరఫున అతనికి ధన్యవాదాలు తెలిపాం. సెయింట్ లూయిస్లో జరగనున్న 21వ 'తానా' కాన్ఫరెన్స్కు అతనిని ఆహ్వానించాం.
ఈ కాల్పుల కారణంగా చాలామంది అమెరికాలో భద్రత పైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి జాత్యాహంకార దాడుల సంఘటన మళ్లీ జరగకుండా చూడాలని చెబుతున్నారు.
కాల్పులకు ఇయాన్ గ్రిల్లెట్ ఎదురొడ్డాడు.
బార్లో ఉన్న మరికొంతమంది సహాయానికి ముందుకు వచ్చారు. కాబట్టి ఈ ఘటన అవివేకమైన, సంకుచితమైన స్వభావం కలిగిన ఓ వ్యక్తి చేసినట్లుగా భావిస్తున్నాం. ఈ కారణంగా తెలుగు వారికి లేదా భారతీయులకు ఎలాంటి ఆందోళన అవసరం లేదు. అమెరికా పైన విశ్వాసం ఉంది.
ఎక్కడ ఎలాంటి సంఘటన జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. కాబట్టి అమెరికాలో భద్రంగా ఉండేందుకు టానా సూచనలను పాటించండి. వీటిని మా వెబ్ సైట్లో ఉంచాం.
మరోసారి
శ్రీనివాస్ కూచిభొట్ల కుటుంబ సభ్యులకు తాము ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అండగా నిలబడిన మా వాలంటీర్లకు, కమ్యూనిటీ మెంబర్లకు ధన్యవాదాలు.
మనమంతా ఏకతాటి పైన ఉండాలని, అలాగే స్ట్రాంగ్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్గా ఎదగాలని ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది.
పీస్ మార్చ్ సమయంలో
అందరు కూడా 'మేం ఇక్కడ ఉన్నాం.. ఇక్కడే ఉంటాం' అని నినదించారు. అమెరికా పైన విశ్వాసం కారణంగానే మేం ఇక్కడకు వచ్చాం. అలాగే, అలాగే, దేశాన్ని ముందుకు తీసుకు వెళ్లేందుకు మేం పని చేస్తాం.
ఇక్కడ మేం మంచి పొరుగు వారిగా ఉంటున్నాం. ఉత్పాధక పౌరులుగా గొప్ప దేశం కోసం, అలాగే గొప్ప ప్రపంచం కోసం పని చేస్తున్నాం. మాది శాంతియుతమైన కమ్యూనిటీ. ప్రేమ - శాంతితో కూడుకున్న కమ్యూనిటీ.
మా చర్మ రంగు వేరు కావొచ్చు, కానీ విలువలు కాదు.
ఇలాంటి అంహిసాయుత సంఘటనలు ప్రపంచంలో ఎక్కడ జరిగినా తాము బాధపడతాము. మా పిల్లలు ఇక్కడే పెరుగుతారు. రెండు గొప్ప సంస్కృతులను వారు జీర్ణించుకుంటారు. తద్వారా మరింత ఉన్నతమైన సహనశీల సమాజం కోసం పని చేస్తారు. ఇక్కడే ఉన్నాం.. ఇక ఇక్కడే ఉంటాం. అందు కోసం తానా పని చేస్తుంది.
ఇందుకోసం తాము ఇతరులతో కలిసి పని చేస్తాము. మా పనితనం, శాంతి పట్ల మా వాదన, ప్రేమ, మా విలువలతో అందర్నీ ఆకట్టుకుంటాం. భవిష్యత్తులో ఇలాంటి విషాధ సంఘటనలు జరగకుండా ప్రభుత్వంతో కలిసి పని చేస్తాం. మనమంతా కలిసి ఉందాం. క్షేమంగా ఉందాం. మన కుటుంబం, స్నేహితులు, పక్కవారు, కమ్యూనిటీని కాపాడుకుందాం.
-
వీ
చౌదరి
జంపాలా,
ఎండీ
ప్రెసిడెంట్
[email protected];
937-475-7809