SPB:ఆ గానమే ఒక మహత్తు - ప్రతీ పాటలో గమ్మత్తు : సప్తస్వరాలు నీ సొత్తు-ఎలా మర్చిపోతాం బాలూ..!!
కొందరు మహానుభావులు కారణం లేకుండా జన్మించరు అని అంటుంటారు పెద్దలు. అలాంటి వారిని కారణజన్ములుగా పిలస్తుంటారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. కారణజన్ముడే. సంగీత ప్రపంచాన్ని ఉద్ధరించడానికే ఆయన జన్మించారు. కొన్ని తరాల వారిని సంగీతం ప్రపంచానికి పరిచయం చేయడానికే ఆయన జన్మనెత్తారు. ఆయనే లేకపోయి ఉంటే.. పాటల తోటలు ఎంతలా వాడిపోయి ఉండేవో ఊహకు కూడా అందదు. సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టాలనుకునే ప్రతి ఒక్క వర్ధమాన గాయకుడు.. బాలసుబ్రహ్మణ్యాన్ని ఓ బెంచ్ మార్క్గా భావిస్తారు. ఆయన స్థాయికి చేరుకోవాలనే కలలు గంటారు. ఈ గానగంధర్వుడు ఎస్పీ బాలు 2020 సెప్టెంబర్ 25వ తేదీన స్వర్గస్తులయ్యారు. నేటికి ఏడాది పూర్తి అయ్యింది..
సంగీత ప్రపంచంలో రాణించాలనే కోరిక ఉన్న వర్థమాన గాయకులకు బాలు పేరు తప్ప మరో పేరు బహుశా స్ఫూర్తికి రాకపోవచ్చు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటలను వినని తరం అనేదే లేకపోవచ్చు. ప్రతి తరంలోనూ ఆయన తన గళ మాధుర్యాన్ని వినిపిస్తూ వచ్చారు. కొన్ని సంవత్సరాల పాటు ఆయన పాటలను వింటూ పెరిగిన వారి సంఖ్య.. ఆకాశంలో నక్షత్రాల్లాంటివే. ఒక్క తెలుగుకు మాత్రమే పరిమితం కాలేదాయన. 16 భారతీయ భాషల్లో పాటలను పాడటం అంటే మాటలు కాదు. వేర్వేరు భాషల్లో ఆయన పాడిన పాటలన్నీ అక్కడి శ్రోతలను కట్టిపడేసేవే. మళ్లీ మళ్లీ వినాలనిపించేవే. ఎస్పీ బాలు పాటలను వింటూ పెరగని వారు బహుశా ఎవరూ ఉండకపోవచ్చు. అభిమానించని వారు ఉండరేమో. అలా కొన్ని తరాలను ఆయన తన గానమాధుర్యంతో కట్టిపడేశారు.
కొన్ని తరాల వారిని సంగీత ప్రపంచ వైపు ఆకర్షితులను చేయగలిగిన శక్తి సామర్థ్యాలు, మాయాజాలం.. ఒక్క బాలసుబ్రహ్మణ్యం గొంతుకు మాత్రమే సాధ్యం. ఆయనలా పాటలు పాడాలని, ఆయనలా సంగీత ప్రపంచానికి సేవలు అందించాలని, ఆయనలా చరిత్రలో నిలిచిపోవాలనే ఉద్దేశంతో వందలాది మంది యువతీ యువకులు సంగీతాన్ని నేర్చుకోవడానికి ముందుకొచ్చారు. తెలుగులో ఓ ప్రైవేటు ఛానల్లో నిర్వహించిన సంగీత పోటీలే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. వందలాది మంది వర్ధమాన గాయకులు ఎస్పీ బాలు ఓ బ్రాండ్నేమ్. చిన్న పిల్లల దగ్గరి నుంచి యువత వరకూ ప్రతి ఒక్కరినీ సంగీతం వైపు ఆకర్షితులను చేయగలిగిన సమ్మోహన గాత్రం ఆయనకు మాత్రమే సాధ్యం.
తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, ఒడిశా, గుజరాతీ, బెంగాలీ, మరాఠీ, భోజ్పురి..ఇలా దాదాపు అన్ని భారతీయ భాషల్లోనూ ఆయన అభిమానులు ఉన్నారు. 40 వేలకు పైగా పాటలు పాడారు. ఎస్పీ బాలు పాడినన్ని భాషలు.. ఇప్పట్లో మరో గాయకుడు అందుకోలేడు. ఆయన పాడినన్ని 40 వేలకు పైగా పాటలను ఇక ముందు కూడా ఎవరూ అందుకోలేరు. దక్షిణాది రాష్ట్రాల చలన చిత్ర పరిశ్రమలో ప్రముఖలు ఎవరూ అంటే.. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు ముందువరసలో ఉంటుంది. ఒక్క గళం.. ఒకే ఒక్క గొంతు.. లెక్కేలేనన్ని భిన్న స్వరాలు వినిపించింది. ప్రతి పాటా భిన్నమే..అయినా గళం మాత్రం ఒక్కటే. ఆ మేజిక్ ఒక్క బాలుకే సాధ్యమైంది. సంగీత ప్రపంచంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సాధించని మైలురాళ్లు, చేరుకోలేని గమ్యం ఉండదు. అన్ని భాషలకు చెందిన సంగీత దర్శకులతో ఆయన పని చేశారు.
క్రీస్తు పూర్వం.. క్రీసు శకం.. అంటూ ఎలా చరిత్రను విభజించారో.. సంగీత ప్రపంచాన్ని కూడా ఎస్పీ బాలుకు ముందు.. ఎస్పీ బాలుకు తరువాత.. అంటూ చెప్పుకోవాల్సి న పరిస్థితులు ఉన్నాయి. నిజమే- జానపదాన్ని, పాశ్చాత్య సంగీతాన్ని మేళవించిన గళం ఆయనది. సంగీత ప్రపంచంలో ఆయన స్పృశించని కోణం అంటూ ఏదీ లేదు. అన్ని స్వరాలూ ఆయన గళం నుంచి జాలువారాయి. ప్రేక్షకులను తన్మయత్వంలో ముంచెత్తాయి. గాన మాధుర్యంలో ఓలలాడించాయి. ఎలాంటి పాటలనైనా అలవోకగా పాడేయడం ఎస్పీ బాలసుబ్రహ్మాణ్యానికి దేవుడిచ్చిన వరం. ఇప్పుడు ఆ గొంతు వినలేక ఎంతో మంది నేటికీ భాదపడుతున్నారు.
భారతీయ సంగీత ప్రపంచానికి ఎనలేని సేవలను అందించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్తో గౌరవించింది. అయితే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మన బాలుకు కేంద్రం భారతరత్నను ప్రకటించాలని సర్వత్రా డిమాండ్లు వినిపిస్తున్నాయి.