బాబుకు తలపోటు: ఆ ముగ్గురిలో ఇద్దరు చేయి
దాడి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీర్థం పుచ్చుకోగా, కడియం శ్రీహరి తెలంగాణ రాష్ట్ర సమితిలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. హరికృష్ణ పార్టీలోనే ఉన్నా స్తబ్దుగా ఉంటున్నారు. ఎంపీ హోదాలో పార్లమెంటుకు హాజరు కావడం మినహా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు. పైకి తెలంగాణ గురించి మాట్లాడుతున్నా కడియం అంతర్గత కారణాలతోనే పార్టీని వీడినట్లు కనిపిస్తోంది. రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులలో తనకు అవకాశం వస్తుందని ఆయన ఆశించారు.
కానీ అవి తనకు కాకుండా దేవేందర్ గౌడ్, సలీం వంటివారిని వరించడం ఆయనను బాగా అసంతృప్తికి గురిచేసింది. ఢిల్లీలో అఖిలపక్ష భేటీకి తనను కాకుండా కడియంను పంపడంపై మోత్కుపల్లి అలిగితే.. పార్టీలో మోత్కుపల్లికి ప్రాధాన్యం ఎక్కువ ఇస్తున్నారంటూ కడియం అలకబూనారు. టిడిపిలో చంద్రబాబుకు బాగా దగ్గర అని ముద్రపడిన వారిలో కడియం ఒకరు. ఆ కారణంగానే కష్టకాలంలో కడియంకు ఆయన బాగా సాయం చేశారు.
తమకు బద్ధ శత్రువుగా మారిన మోత్కుపల్లి నర్సింహులు వల్లే కడియం అసంతృప్తితో ఉన్నారని గ్రహించిన తెరాస వర్గాలు.. ఆయన్ను తమవైపు లాగే ప్రయత్నాలను వేగవంతం చేశాయి. దీన్ని గ్రహించిన టీడీపీ వర్గాలు కూడా.. కడియం నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు తమతోనే ఉండేలా లోపాయికారీగా తమ పని తాము చేస్తూ వచ్చాయి. కడియం నిష్క్రమణ టిడిపిలో సీనియర్ల వైఖరిని మరోసారి చర్చనీయాంశం చేసింది.
సీనియర్లు ఎంతసేపూ తమ పదవులు, అవసరాల కోసమే పోరాడుతూ తర్వాత తరం గురించి ఆలోచించడం లేదని, సీనియర్లే పార్టీకి బరువుగా మారుతున్నారన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల నుంచి వినవస్తున్నాయి. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొడ్డు భాస్కర రామారావు, దాడి వీరభద్రరావు, కడియం శ్రీహరి లాంటి వారు అనేక అవకాశాలు అందుకొన్నారని, వారితో పోలిస్తే చాలామందికి ఆ మాత్రం అవకాశాలు కూడా రాలేదని, అయినా వీరంతా పార్టీని వీడుతున్నారని చర్చ సాగుతోంది.