దిల్షుక్నగర్ పేలుళ్లు: ఎవరీ యాసిన్ భత్కల్?
న్యూఢిల్లీ: ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ అరెస్టుతో భారతదేశంలోని పలు బాంబు పేలుళ్ల కేసుల చిక్కు ముడి వీడనుంది. పలు కేసుల్లో పాలు పంచుకున్నట్లు యాసిన్ భత్కల్పై ఆరోపణలున్నాయి. కర్ణాటక స్పెషల్ టాస్క్ఫోర్స్, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) సంయుక్త ఆపరేషన్ ద్వారా అతను నేపాల్ సరిహద్దుల్లో పట్టుబడ్డాడు.
అతనిపై ఢిల్లీ హైకోర్టు వెలుపల 2011 సెప్టెంబర్ 7వ తేదీన జరిగిన బాంబు పేలుళ్ల కేసు ఉంది. ఈ పేలుళ్ల ఘటనలో 12 మంది మరణించారు. పూణేలోని జర్మన్ బేకరి బాంబు పేలుళ్ల కేసులో కూడా భత్కల్ కోసం దర్యాప్తు అధికారులు అన్వేషిస్తున్నారు. ఈ పేలుళ్లలో ఐదుగురు విదేశీయులతో పాటు మొత్తం 17 మంది మరణించారు. మరో 57 మంది గాయపడ్డారు. ముంబై ఉగ్రవాదుల దాడులకు ముందు జరిగిన ప్రధాన ఉగ్రవాద చర్యలు ఇవి.
జంగ్లీ మహరాజ్ రోడ్ పేలుళ్లలకు కూడా యాసిన్ భత్కల్ కుట్ర చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ పేలుళ్లు నిరుడు ఆగస్టు 1వ తేదీన సంభవించాయి. యాసిన్ భత్కల్ను ఎన్ఐఎ మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చింది.
భత్కల్ అసలు పేరు సయ్యద్ అహ్మద్ జరార్ సిద్దిపప్ప. కర్ణాటకలోని భత్కల్లో అతను ఇంజనీరింగ్ చేశాడు. భత్కల్ ఓసారి అరెస్టయి బెయిల్ మీద విడుదలై పరారయ్యాడు. ఒకటి రెండు సార్లు పోలీసులకు అతను చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నాడు.
భత్కల్ 2008లో అరెస్టు నుంచి తప్పించుకున్నాడు. పశ్చిమ బెంగాల్ పోలీసులకు అతని గురించి సమాచారం లేకపోవడంతో తప్పించుకోగలిగాడు. 2011 నవంబర్లో చెన్నైలోని సెలైయూర్లోని 19 ఏళ్ల అబ్దుల్ రెహ్మాన్ ఇంటిపై నిఘా సంస్థ అధికారులు, ఢిల్లీ, చెన్నై పోలీసులు దాడి చేయడానికి కొద్ది గంటల ముందే అక్కడి నుంచి పారిపోయాడు.
యాసిన్కు రియాజ్, ఇక్బాల్ భత్కల్ అనే సోదరులున్నారు. వీరిలో రియాజ్ ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపక సభ్యుడు. రియాజ్ భత్కల్ ప్రస్తుతం పాకిస్తాన్లోని కరాచీలో ఉన్నట్లు సమాచారం. పాకిస్తాన్కు పారిపోవడానికి ముందు పలు మార్లు భారత సంస్థల నుంచి తప్పించుకున్నాడు.
ఇక్బాల్ భక్తల్ కూడా ఇండియన్ ముజాహిదీన్ ఏర్పాటులో పాలు పంచుకున్నాడు. కర్ణాటకకు చెందిన ఇక్బాల్ భక్తల్ తొలుత గుజరాత్లో పలు దాడులకు ప్రణాళికలు వేశాడు. ఇప్పుడు రియాజ్తో పాటు కరాచీలో ఉన్నట్లు సమాచారం.