ఒక మోడీ.. ఓ కేజ్రీవాల్: కేసీఆర్-బాబులకు హెచ్చరిక
న్యూఢిల్లీ: మినీ ఇండియాగా భావించే ఢిల్లీ.. శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ధాటికి తుడిచిపెట్టుకుపోయాయి. 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీలో బీజేపీ మూడు సీట్లతో సరిపెట్టుకోగా, కాంగ్రెస్ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. ఈ ఎన్నికలు బీజేపీతో పాటు చాలామందికి ఓ గుణపాఠం అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
దేశంలో కాంగ్రెస్, బీజేపీలకు బదులు ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అర్థమవుతోందని చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. ఢిల్లీ ఎన్నికలు బీజేపీకే కాకుండా.. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీలకు కూడా ఓ హెచ్చరిక అని గుర్తు చేస్తున్నారు. ఇప్పటికి కూడా తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడులు సాధ్యం కాని మాటలు చెబుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
గత సార్వత్రిక ఎన్నికలకు ముందు గుజరాత్ నమూనా అంటూ బీజేపీ, మోడీ కాంగ్రెస్ పార్టీని ఏకేసింది. గుజరాత్ అభివృద్ధి చెందిన నేపథ్యంలో మోడీని గెలిపిస్తే భారత్ను అభివృద్ధి చేస్తారని దేశ ప్రజలు ఆశించారు. అందుకోసం.. ముప్పయ్యేళ్ల తర్వాత బీజేపీకి లోకసభ ఎన్నికల్లో స్పష్టమైన హామీ ఇచ్చారు. ఎన్నికలకు ముందు మోడీ ఎన్నో చెప్పారని, అవి సాధ్యం కాని రీతిలో ఉన్నాయని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
ముఖ్యంగా నల్లధనం వెలికితీత మోడీకి చిక్కులు తెచ్చిపెడుతోంది. తాము అధికారంలోకి వస్తే నెలల్లోనే దానిని వెనక్కి తెస్తామని మోడీ ఊదరగొట్టారు. కానీ, ఇప్పుడు మాత్రం అందులో ఎన్నో చిక్కులు ఉన్నాయని, వాటికి సమయం పడుతుందని చెబుతున్నారు. మోడీ నిత్యం విదేశీ పర్యటనలు, ప్రకటనలతో సరిపుచ్చటం తప్ప చేసిందేమీ లేదని విమర్శకులు అంటున్న మాట.
ప్రజల అంచనాలను మోడీ అందుకోలేకపోతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే, అధికారంలోకి వచ్చి యేడాది కాకుండానే అంచనాలు అందుకోలేకపోతున్నామని చెప్పడం సరికాదనేది బీజేపీ మాట. యూపీఏ చేసిన తప్పులను సరిదిద్దేందుకే సమయం పడుతుందని చెబుతున్నారు. అయితే ఈ వ్యాఖ్యలు ప్రజలను ఆకట్టుకోవడం లేదు. ఈ నేపథ్యంలో వచ్చిన ఢిల్లీ ఎన్నికలు బీజేపీకి గట్టి షాకిచ్చాయి.
సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగించింది. ఢిల్లీలో మాత్రం బీజేపీ చతికిలపడింది. తద్వారా.. దేశ ప్రజలు కాంగ్రెస్ను పక్కన పెట్టి నిన్నటి వరకు బీజేపీ వైపు చూశారని, ఇప్పుడు మరింత మార్పు కోసం చూస్తున్నారని, అందుకే ఏఏపీని గెలిపించారని విశ్లేషిస్తున్నారు.
ఇక, తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఎన్నికలకు ముందు, ఇప్పుడు కూడా వారు ఆచరణ సాధ్యం కాని విషయాలు చెబుతున్నారనే విమర్శలు ఉన్నాయి. తెలంగాణలో గత ఏడాది చేపట్టిన సమగ్ర సర్వే వివాదాస్పదమైంది. ఆ సర్వే వల్ల ఏం లాభం జరిగిందో చెప్పాలని విపక్షాలు మండిపడ్డాయి. ఇటీవలి కాలంలో సీఎం కేసీఆర్ ఛాతి ఆసుపత్రి తరలింపు నిర్ణయం వివాదాస్పదమైంది.
నగరంలో అందరికీ అందుబాటులో ఉన్న ఆసుపత్రిని తీసుకు వెళ్లి ఎక్కడో హైదరాబాదుకు డెబ్బై కిలోమీటర్ల దూరంలో పడేయటమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇవి పక్కన పెడితే.. హైదరాబాదును విదేశీ నగరంగా చేస్తామని చెప్పడమే కాకుండా.. వాస్తు పేరుతో సచివాలయం మార్పు, సాగర్ చుట్టూ ఆకాశహర్మ్యాలు, వంద అంతస్తుల భవనాలు, అన్నికార్యాలయాలు ఒకేచోట, ఇంటింటికి నల్లా, ఈ వేసవిలో హుస్సేన్ సాగర్ శుద్ది.. ఇవన్నీ ప్రజలను మభ్య పెట్టేందుకేననేది విపక్షాల విమర్శ.
అందుకు వారు కారణాలు కూడా చెబుతున్నారు. ఎన్నికలకు ముందు దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్, ఆ తర్వాత మాట మార్చి తాను ఆ పీఠంపై కూర్చున్నారని గుర్తు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోను ఫాస్ట్ పథకం ఉండాలని పట్టుబట్టిన కేసీఆర్.. ఇటీవల ఫాస్ట్ లేదు.. గీస్టు లేదు అని చెప్పారు. అది గ్రేటర్ ఎన్నికల్లో ఏపీ ఓటర్లను తమ వైపు లాక్కునేందుకేనని అంటున్నారు.
ఇక, ప్రతిపక్షాలను బలహీనం చేసేందుకు టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుండి భారీగా వలసలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రజల్లో క్రమంగా మార్పు వస్తోందని, అందుకే జంపింగ్స్ అభ్యర్థులను, ఆ పార్టీలను ఓటర్లు ఢిల్లీ ఎన్నికల్లో తిరస్కరించారని గుర్తు చేస్తున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు కూడా ప్రజలను రాజధాని, సింగపూర్ వంటి నగరం అంటూ మభ్యపెడుతున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ అంటూ అధికారంలోకి వచ్చి, వారిని మోసం చేస్తున్నారని కాంగ్రెస్, వైపీపీ విమర్శిస్తున్నాయి.
ఇప్పటికే లోటు బడ్జెట్లో ఉన్న ఏపీలో జపాన్, సింగపూర్ దేశాల సహకారంతో అత్యాధునిక రాజధాని నిర్మిస్తామని చంద్రబాబు చెప్పడం ప్రజలను మభ్యపెట్టడమేననే విమర్శలు వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ప్రజలను మభ్యపెడితే బీజేపీకి పట్టిన గతి పడుతుందని విపక్షాలు హెచ్చరిస్తున్నాయి.