రేపిస్టుల ఫొటోలెక్కడివని సునితా కృష్ణన్కు ప్రశ్న
హైదరాబాద్: లైగింక దాడులకు పాల్పడిన వ్యక్తుల ఫొటోలు ఇంటర్నెట్లోకి ఎలా వచ్చాయనే విషయంపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నగర అదనపు కమిషనర్ (నేరాలు) స్వాతి లక్రా తెలిపారు. శుక్రవారం పాతబస్తీలో సామాజిక కార్యకర్త సునీతా కృష్ణన్ వాహనంపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసిన విషయం తెలిసిందే.
ఇంటర్నెట్లో ఆప్లోడ్ అయిన ఫోటోలు ఉత్తర భారత దేశానికి చెందిన వారిగా ఉన్నాయని స్వాతి లక్రా చెప్పారు. అసలు బాధితులెవరు? ఆ ఫోటోలు ఎలా వచ్చాయి? అనే విషయంపై సునీతా కృష్ణన్ నుంచి సమాచారాన్ని సేకరించి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
సామాజిక కార్యకర్త, ప్రజ్వల హోం నిర్వాహకురాలు సునితా కృష్ణన్పై కొందరు వ్యక్తులు ఇటీవల దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆమె కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. సునితా కృష్ణన్ తన ఫేస్బుక్లో అప్లోడ్ చేసి ఓ వీడియో ఈ దాడికి కారణమైంది. ఓ యువతిపై ఐదుగురు యువకులు అత్యాచారం చేసి ఆ వీడియోను యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె అత్యాచారానికి కారకులైన యువకుల ముఖాలను గుర్తించే విధంగా వీడియోను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు.
వీడియో పోస్టింగ్కు ముందు సునితా కృష్ణన్ పలు జాగ్రత్తలు తీసుకున్నారు. అత్యాచారానికి గురైన బాధితురాలు ముఖం కనిపించకుండా కేవలం అత్యాచారానికి పాల్పడి పైశాచిక ఆనందం పొందిన యువకుల ముఖాలను రౌండ్ చేస్తూ వీడియోను పోస్టు చేశారు. అత్యాచార ఘటనపై ప్రజ్వల హోం నిర్వాహకురాలు సునితా కృష్ణన్ ఇచ్చిన ఫిర్యాదును నమోదు చేశామని హైదరాబాద్ అడిషినల్ సీపీ స్వాతిలక్రా చెప్పారు. ప్రజలు ఇటువంటి సంఘటనలపై తక్షణం స్పందించి పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆమె అన్నారు.
తాను ఇంటర్నెట్లో అప్ లోడ్ చేసిన వీడియోను ఆరు నెలల క్రితమే చూశానని ఓ వ్యక్తి తనకు ఫోన్ చేశాడని, ఇలాంటి వీడియోను చూసి మీరు ఎంజాయ్ చేస్తున్నారా అంటూ ప్రముఖ స్వచ్ఛంధ కార్యకర్త సునితా కృష్ణన్ అదే రోజు మీడియాతో అన్నారు. తాను రేపిస్ట్స్ను ఎక్స్పోజ్ చేశానని, ఈ నేపథ్యంలో తన పైన దాడి జరిగిందని చెప్పారు. తాను నిందితుల ఫోటోలను సామాజిక వెబ్ సైట్లలో పెట్టానని చెప్పారు. ఎవరైనా వారిని గుర్తిస్తే చెప్పాలని కోరానని తెలిపారు. తాను నిన్న సాయంత్రం సామాజిక వెబ్ సైట్లలో పెట్టానని చెప్పారు. ఈ రోజు జాతీయ మీడియా ద్వారా తాను ప్రచారం చేశానని తెలిపారు.
అనంతరం తొమ్మిది గంటల తర్వాత తన పైన దాడికి యత్నం జరిగిందని చెప్పారు. తన కారును ధ్వంసం చేశారన్నారు. నిందితులు రేప్ చేయడమే కాకుండా ఇలాంటి ఘటనలకు పాల్పడటానికి వారికి ఎందుకు ఇంత ధైర్యం అని ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన వీడియోలను తాను కేంద్ర ప్రభుత్వానికి హ్యాండోవర్ చేస్తున్నట్లు చెప్పారు. బాధితులు తన వద్దకు ఇక ముందు కూడా వస్తారని, ఇలా చాలా వీడియోలు బయటకు వస్తాయని హెచ్చరించారు.
అయితే, ఇలాంటి దుర్మార్గాల పట్ల తాను ఒక్కదానినే రిపోర్ట్ చేస్తే సరిపోదన్నారు. అందరు కలిసి రావాలని కోరారు. ఓ వ్యక్తి తనకు ఫోన్ చేసి ఆరు నెలల క్రితమే రేప్కు సంబంధించిన వీడియోను చూశానని చెప్పాడని, వాటిని చూసి మీరు ఎంజాయ్ చేస్తున్నారా అని ఘాటుగా ప్రశ్నించారు. జరిగిన ఘోరాల పైన ఎవరికైనా ఫిర్యాదు చేసే ధైర్యం లేకుంటే తనను కలిసి చెప్పవచ్చునని, తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అత్యాచారానికి సంబంధించి రెండు వీడియోలు ఉన్నాయని, ఒకటి ఉత్తర ప్రదేశ్ లేదా ఢిల్లీలో జరిగి ఉంటుందని చెప్పారు. ఈ రోజు తన పైన జరిగిన దాడి విషయమై తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని, వారు బాగా స్పందించారని సునితా కృష్ణన్ పేర్కొన్నారు.
యూట్యూబ్లో తాను నిందితుల గురించి పెట్టిన వీడియోలను తొలగించారని, వాటిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. ఏదైనా సంఘటన జరిగితే ఎవరు కూడా ఫిర్యాదు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రేప్కు సంబంధించిన వీడియోలు అప్ లోడ్ చేస్తున్నారని, అలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. కాగా, నిందితులు సునితా కృష్ణన్ ఫేస్ బుక్, యూ్ట్యూబ్ అకౌంట్లను హ్యాక్ చేశారు. తాను వీడియోల పైన పోరాటం ప్రారంభించానని చెప్పారు. తన పైన దాడి జరిగిన అంశంపై ఆమె సామాజిక అనుసంధాన వెబ్ సైట్లలోను స్పందించారు. ఎన్డీటీవీలో తాను 'షేమ్ ది రేపిస్ట్ కంపైన్' గురించి మాట్లాడిన అర్ధగంటలో అంటే ఉదయం తొమ్మిదిన్నరకు తన కారును ధ్వంసం చేశారని పేర్కొన్నారు.