టిడిపికి వేనేపల్లి రిజైన్: తుమ్మల కోసం విస్తరణ
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి, తమ పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్న ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వర రావుకు మంత్రి పదవి ఇవ్వడానికి తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆయన కోసమే మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
కాగా, నల్లగొండ జిల్లాకు చెందిన వేనేపల్లి చందర్ రావు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. తుమ్మల నాగేశ్వర రావుతో పాటు ఆయన ఈ నెల 5వ తేదీన తెరాసలో చేరే అవకాశాలున్నాయి. తుమ్మల కోసమే తన మంత్రివర్గాన్ని విస్తరించాలని కెసిఆర్ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అవసరమని మరికొందరికి కూడా ఈ విస్తరణలో బెర్త్ దక్కవచ్చనే ప్రచారం జరుగుతోంది.
రాబోయే పది, పదిహేను రోజుల్లో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి అధికార వర్గాలు కూడా చెబుతున్నాయి. ఈమేరకు మంత్రివర్గ విస్తరణ ముహూర్తంగా ఈనెల 10వ తేదీని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జూన్ 2న తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కె.చంద్రశేఖర్రావు, మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలోని శాసనసభ్యుల దామాషా ప్రకారం మరో ఆరుగురిని మంత్రివర్గంలోకి తీసుకోవచ్చు. ఆగస్టు నెలాఖరులో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కెసిఆర్ అంటున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉంటుందని మీడియా ప్రతినిధులు అడిగితే తనకు జాతకాలు తెలియదని కెసిఆర్ అన్నారు.