దిల్షుక్నగర్ పేలుళ్లు: పోలీసు ప్రయత్నాలు
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం - ఉగ్రవాదులు హైదరాబాద్ స్థానికుల సహకారంతో ఆశ్రయం పొంది ఉంటారు. పేలుళ్లకు కొంత కాలం ముందుగా, రెండు మూడు నెలలు ముందుగా వారు ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటారు. పేలుళ్లు జరగడానికి కొంచెం ముందుగా లేదా పేలుళ్లు జరిగిన మరు క్షణమే ఖాళీ చేసి ఉంటారు. లేదా ఇంట్లో ఉండకుండా తాళం వేసి వెళ్లిపోయి ఉంటారు.
ఇద్దరు వ్యక్తులు బాంబులు పెట్టి ఉంటారనేది అనుమానం. తమను ఎవరూ గుర్తు పట్టకుండా టోపీలు ధరించి, బ్యాగ్/ రగ్ సాక్/ బ్యాక్ ప్యాక్ మోసుకుని వెళ్లి ఉంటారు. ఇద్దరిలో ఒకతను బాంబు పెట్టే సమయంలో చెక్డ్ షర్ట్, ఫుల్ స్లీవ్స్, జీన్స్ ప్యాంట్, తెల్ల స్సోర్ట్స్ టైప్ బూట్లు ధరించి ఉన్నాడు.
బాంబులు పెట్టినవాళ్లు రెండు సైకిళ్లను వాడారు. వాటిపైనే బాంబులు పెట్టి పేల్చారు.ఆ సైకిళ్లను హైదరాబాద్లో కొని ఉంటారు.అవి సెకండ్ హ్యాండ్ సైకిళ్లు. ఓ సైకిల్ వెనక భాగం ధ్వంసమైంది. మడ్ - గార్డ్పై తెల్ల పెయింట్, స్టిక్కర్ కనిపిస్తున్నాయి. ఆ సైకిళ్ల క్రయవిక్రయాలకు, వాడకాకి, విడి భాగాల కూర్పు వంటి సమాచారం తెలిసి ఉంటే అందించగలరు. విడిభాగాలతో సైకిళ్లను హైదరాబాద్లోనే తయారు చేశారు.
పేలుడు పదార్థాల క్రయవిక్రయాలు
బాంబుల తయారీకి పేలుడు పదార్థాలను స్థానిక మార్కెట్లో కొనుగోలు చేసిన లేదా అక్రమంగా రవాణా చేసిన అనుమానిత వ్యక్తికి సంబంధించిన సమాచారం ఉంటే తెలియజేయాలని కోరారు.
నల్లరంగు షోల్డర్ బ్యార్/ రగ్ - సాక్/ బ్యాక్ ప్యాక్ బ్యాగ్ కొనుగోలు చేసినప్పుడు టోపీ ధరించి గానీ మామూలుగా గానీ అనుమానాస్పదంగా కనిపించినట్లు అనిపించిన వ్యక్తి సమాచారాన్ని ఇవ్వాలని కోరుతున్నారు. హైదరాబాద్లో ఇటువంటి పేలుళ్ల ఘటనలు గతంలో కూడా జరిగాయి. పలువురు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.
దిల్షుక్నగర్ పేలుళ్లకు పాల్పడినవారి గురించి పోలీసులు ఇలా చెబుతున్నారు - బాంబులు పెట్టినవాళ్లు పేలుళ్లు జరిగిన స్థలానికి వెంకటాద్రి థియేటర్ నుంచి చేరుకున్నారు. వారిలో ఒకతను 107 బస్ స్టాండ్ వెనక సైకిల్ బాంబు పెట్టి వచ్చిన మార్గాన్నే వెనక్కి వెళ్లాడు. ఎ1 మిర్చి షాపు వద్ద బాంబు ఉన్న సైకిల్ను పెట్టినతను కూడా వెంకటాద్రి థియేటర్ నుంచే అక్కడికి చేరుకున్నట్లు అనుమానంగా ఉంది. బాంబు పెట్టి అతను వెనక్కి వెళ్లిపోయాడు.
అనుమానితులు బాంబులు పెట్టిన తర్వాత సంఘటనా స్థలం నుంచి ఆటో/ బస్సు లేదా ఇతర ప్రభుత్వ వాహనంలో వెళ్లిపోయి ఉండవచ్చు. బాంబులు పెట్టినవాళ్లు సైకిళ్లను, బాంబులు తయారు చేయడానికి వాడిన అల్యూమినియం కంటైనర్లను, బ్యాటరీలను, పేలుడు పదార్థాలను (అమ్మోనియం నైట్రేట్)ను కొనుగోలు చేయడానికి హైదరాబాద్కు చెందిన స్థానికులను వాడుకుని ఉంటారు. బాంబులు పెట్టడానికి ముందు సంఘటనా స్థలాలను అనుమానితులు పలుమార్లు సందర్శించి ఉంటారు.
పేలుళ్లకు సంబంధించిన సమాచారం తెలిసినవారు దాన్ని ఎన్ఐఎ కార్యాలయానికి అందజేయాల్సిందిగా కోరారు. నిందితలు అరెస్టుకు ఉపయోగకరమైన సమాచారం అందించినవారికి రూ.10 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపారు. సమాచారం అందించిన వ్యక్తి వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పారు.
కరపత్రంలో సమాచారం అందించడానికి 040 - 27853412, 040 - 27853413 అనే ల్యాండ్లైన్ నెంబర్లు, 09490617100 అనే మొబైల్ నెంబర్ ఇచ్చారు. అదే విధంగా [email protected], [email protected] అనే మెయిల్స్కు కూడా సమాచారం ఇవ్వవచ్చునని తెలిపారు.