బాద్షా షారూక్ ఖాన్ దిమ్మ తిరిగిందా?

ఇప్పుడు షారూక్ ఖాన్ రాజకీయాల గురించి గానీ మతం గురించిగానీ మాట్లాడబోనని భీష్మించుకున్నారు. ఇప్పటి నుంచి తాను రాజకీయాల గురించి గానీ, మతం గురించి గానీ మాట్లాడకూడదని నిర్ణయించుకున్నానని ఆయన ఓ ప్రముఖ పత్రికతో అన్నారు. అయితే, తాను భావ ప్రకటనా స్వేచ్ఛకు మాత్రమే ఓటేస్తానని చెప్పారు. తక్షణ సమస్యలపై మాట్లాడే అలవాటు ఉన్న షారూక్ ఇక నుంచి ఆ రెండు విషయాలపై మాట్లాడబోనని అంటున్నారు.
తానో నటుడిని అని, తనతో మాట్లాడాలదలుచుకుంటే తన సినిమాల గురించి మాట్లాడాలని, సీరియస్ విషయాల గురించి మాట్లాడాలనుకుంటే మీరు సీరియస్ వ్యక్తుల వద్దకు వెళ్లాలని, నటీనటుల వద్దకు రావద్దని ఆయన ఆ పత్రికతో అన్నారు. ఇటీవలి కాలంలో పలువురు కళాకారులు వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. కమల్ హాసన్ విశ్వరూపం సినిమా దానికి పరాకాష్ట.
రచయిత సల్మాన్ రష్దీ వివాదం, రచయిత ఆశీష్ నందీ వివాదం మనం చూశాం. ఏం మాట్లాడినా వివాదంగా మారే పరిస్థితి ప్రస్తుతం దేశంలో నెలకొన్నట్లు కనిపిస్తోంది. ఓ వ్యాఖ్యలోని వెనకా ముందులు చూడకుండా, వాటిని పరిగణనలోకి తీసుకోకుండా వివాదాలు రేపడం ఆనవాయితీగా మారింది. ఆశీష్ నందీ విషయంలో అదే జరిగింది. తన ఆర్టికల్ విషయంలోనూ అదే జరిగిందని షారూక్ ఆవేదన వ్యక్తం చేశాడు.
చదవకుండా తన ఆర్టికల్పై వ్యాఖ్యలు చేయవద్దని ఆయన కోరారు. తాను తనకు భారతదేశంలో రక్షణ లేదని ఎక్కడా రాయలేదని ఆయన వివరణ ఇచ్చుకున్నారు. ఒకవేళ మాట్లాడదలుచుకుంటే - తన వ్యాసాన్ని పూర్తిగా చదవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications