కెసిఆర్ ప్రభుత్వ సలహాదారులు ఆరుగురు వీరే
సాగునీటి వ్యవహారాల నిపుణుడు ఆర్.విద్యాసాగర్రావు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఏకే గోయల్, ఎ. రామలక్ష్మణ్, బీవీ పాపారావు, కేవీ రమణాచారితోపాటు, రిటైర్డ్ ఐఈఎస్ అధికారి జీఆర్ రెడ్డిలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా నియమించారు. వీరి పదవీకాలాన్ని ఏడాదిగా పేర్కొంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరి నియామకాలకు సంబంధించిన విధి విధానాలను విడిగా జారీ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో చెప్పారు.
విద్యాసాగర్రావు సాగునీటి శాఖలో చీఫ్ ఇంజనీర్గా పని చేశారు. ఎప్పటి నుంచో సాగునీటి రంగానికి సంబంధించి తెరాస నేతలకు సలహాలు, సూచనలు అందిస్తున్నారు. కేంద్ర జలవనరుల సంఘంలో చీఫ్ ఇంజనీరుగా పనిచేశారు.
ఎకె గోయల్ పదవీ విరమణ చేసిన ఐఎఎస్ అధికారి. రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన ప్రణాళిక, ఇంధన శాఖల ముఖ్య కార్యదర్సిగా పనిచేశారు. ఆ తర్వాత తెరాసలో చేరారు.
ఎ. రామలక్ష్మణ్ పదవీ విరమణ చేసిన ఐఎఎస్ అధికారి. వివిధ హోదాల్లో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పని చేశారు సాంస్కృతిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా పదవీ విరమణ చేసి, తెరాసలో చేరారు.
కెవి రమణాచారి తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగా, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా, సమాచార శాఖ కమిషనర్గా పనిచేశారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో కొంత కాలం సాంస్కృతిక శాఖ సలహాదారుగా కూడా పనిచేశారు. ఆయన పదవీ విరమణ చేసి తెరాసలో చేరారు.
జీఆర్ రెడ్డి ప్రస్తుతం ఆర్థిక శాఖలో 14వ ఆర్థిక సంఘం నిధుల కోసం కిరణ్ కుమార్ రెడ్డి సలహాదారుగా నియమించారు. ఆర్థికాంశాల్లో నిపుణుడైన జిఆర్ రెడ్డి ఆర్థిక శాఖలోనే పలు బాధ్యతలు నిర్వహించారు.
బీవి పాపారావు మాజీ ఐఎఎస్ అధికారి. విశేషమైన అనుభవం ఉన్న వ్యక్తి. పదవీవిరమణ తర్వాత తెరాసలో కీలక భూమిక పోషిస్తున్నారు.