జగన్ ఎమ్మెల్యేలు ఎన్నికలకు సిద్ధంగా లేరా?
అందుకు ప్రధానంగా ప్రజారాజ్యం పార్టీ నుండి గెలిచిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగి రెడ్డిని ఉదారహణగా చూపిస్తున్నారు. తాము ఉప ఎన్నికలకు భయపడటం లేదని, వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతూనే తన శాసనసభ్యత్వం కోల్పోకూడదని న్యాయపరంగా డిమాండ్ చేస్తున్నానని ఆమె చెబుతున్నారు. రూల్స్ ప్రకారం అనే అంశాన్ని పక్కన పెడితే ఇలాంటి మాటలు ఉప ఎన్నికలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేకపోవడం వల్లనే అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆమె దారిలోనే మరికొందరు జగన్ ఎమ్మెల్యేలు ఉప ఎన్నికలకు సిద్ధంగా లేరనే ప్రచారం జరుగుతోంది. అందుకోసం వారు అవసరమైన అన్నిదారులు వెతుక్కుంటున్నారట.
మొదట తమపై అనర్హత వేటు పడకుండా ఏమైనా అవకాశాలు ఉన్నాయా? అని దారులు వెతుక్కుంటున్నారట. ఒకవేళ స్పీకర్ శాసనసభ్యత్వాలను రద్దు చేస్తే న్యాయపోరాటం చేయాలని శోభా నాగి రెడ్డి వంటి వారు యోచిస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కొండా సురేఖ కూడా వెనక్కి పోయే అవకాశముందనే అనుమానాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు తెలంగాణపై జగన్ స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఈ పరిస్థితుల్లో జగన్ అభ్యర్థిగా పోటీ చేస్తే కష్టాలు తప్పవని కొందరు తెలంగాణ నేతలు భావిస్తున్నట్లుగా సమాచారం.