కిరణ్ చేతికి 'ఐ': ఛానళ్ల కోసం పోటా పోటీ
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ ఐ న్యూస్ను కొన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల పలువురు ప్రజాప్రతినిధులు న్యూస్ ఛానల్స్ను కొనడం, ఏర్పాటు చేసుకోవడం జరుగుతున్న విషయం తెలిసిందే. ఐ న్యూస్ తెలుగు ఛానల్ను కిరణ్ కొన్నారనే అంశాన్ని తెలుగు యువత బుధవారం ప్రశ్నించింది. చానల్ను కొనేందుకు ముఖ్యమంత్రికి డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయని ప్రశ్నించింది.
ప్రజా సంపదను కొల్లగొట్టి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబం సాక్షి చానల్, పత్రిక ఏర్పాటు చేసినట్లే కిరణ్ కుటుంబం గత రెండేళ్ల అవినీతి సంపాదనతో చానల్ కొనుగోలు చేసిందని విమర్శించారు. కాంగ్రెసు నేతలు పలువురు ఇటీవల న్యూస్ ఛానళ్లను కొనేందుకు ప్రయత్నాలు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. 17 ఏళ్లు అధికారంలో ఉన్న టిడిపి కనీసం పత్రికను కూడా ఏర్పాటు చేసుకోలేని స్థితిలో ఉంటే అనతికాలంలోనే వీరు చానళ్లు కొనుగోలు చేసే స్థాయికి ఎదిగారని తెలుగు యువత ఆరోపించింది.
పలువురు రాజకీయ నాయకులు ఛానళ్లకును కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారట. ఎవరికి వారు పార్టీని, ప్రధానంగా తమ వ్యక్తిగత ప్రతిష్టను ప్రజల్లో పెంపొందించుకునేందుకు ఈ దిశలో ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్ సాక్షి వచ్చిన కొద్ది రోజుల తర్వాత చంద్రబాబు అక్షర అనే పత్రికను తీసుకు వస్తారనే వార్తలు వచ్చాయి.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రముఖ ఐ న్యూస్ ఛానల్ను కొనుగోలు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. తన హయాంలోని ప్రభుత్వం చేపడుతున్న పథకాలను, తన ఇమేజ్ను పెంపొందించుకునే వ్యూహంలో భాగంగా కిరణ్ ఈ ఛానల్ కొన్నట్లుగా చెబుతున్నారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా సాక్షి దిన పత్రికను, ఆ తర్వాత సాక్షి ఛానల్ను ప్రారంభించిన విషయం తెలిసిందే.
స్టూడియో-ఎన్ ఛానల్ను గతంలో నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నిర్వహించారు. ఇప్పుడు అది జూనియర్ ఎన్టీఆర్ చేతిలోకి వెళ్లింది.
పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ ఇటీవల జీ 24 గంటలు ఛానల్లో వాటా తీసుకునేందుకు ప్రయత్నాలు చేసినట్లుగా వార్తలు వచ్చాయి.
ముఖ్యమంత్రి సన్నిహితుడిగా ముద్రపడిన రంగారెడ్డి చేతిలో 'ఎ' న్యూస్ ఛానల్ ఉంది.
సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్లు కూడా టివి ఛానళ్ల ఏర్పాటు ప్రయత్నాల్లో ఉన్నారట. అల్లు తన బావ చిరంజీవిని ప్రమోట్ చేసేందుకు ఈ టీవి ఛానల్ ఉపయోగించనున్నారట.