పోలవరం: వ్యతిరేకతని 'జగన్' అధిగమించగలడా?
అయితే అభ్యర్థుల ఖరారు విషయంలో ఇటు తెలుగుదేశం, అటు కాంగ్రెస్ పార్టీల్లో అసంతృప్తి చిచ్చు రగిలింది. దాదాపు రెండు దశాబ్దాలకు పైగానియోజకవర్గ ముఖ్యనేతగా ఉన్న పూనెం సింగన్నదొర ఈసారి తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని టిడిపి అధిష్ఠానాన్ని కోరారు. కానీ, న్యాయవాది శ్రీనివాస రావుకు టికెట్ దక్కింది. దీంతో అలకబూనిన సింగన్నదొర కుటుంబం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరింది. అయినా ఇక్కడ టిడిపి ప్రచారంలో దూసుకెళ్తోంది.
గడప గడపకు ప్రచారం చేస్తోంది. గిరిజనులతో పాటు గిరిజనేతరులను కలుపుకెళ్లడంలో శ్రీనివాస రావు ఇప్పటికే కొంత విజయం సాధించారు. గతంలో ఇక్కడి నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 36వేలకు పైగా ఓట్లు సాధించిన బొరగం శ్రీనివాస రావును టిడిపి తమవైపు తిప్పుకొంది. గిరిజనంలో ఆయనకున్న ఇమేజ్ టిడిపికి కొత్త బలాన్నిచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికలోనే ఆ పార్టీకి అసంతృప్తి సెగ గట్టిగా తాకింది.
ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బొజ్జి దొరను నిలపాలని డిసిసిబి చైర్మన్, సీనియర్ నేత కరాటం రాంబాబు పట్టుబట్టారు. కానీ పార్టీ టికెట్ మాత్రం నూపా పార్వతికి వచ్చింది. దీంతో అసంతృప్తితో రగిలిపోయిన కరాటం రాంబాబు తన పదవికి రాజీనామా చేశారు. రాంబాబును చివరకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చి స్వయంగా బుజ్జగించారు. దీంతో రాంబాబు కాస్త మెత్తబడ్డారు. కానీ, కాంగ్రెస్కు జరగాల్సిన నష్టం ఇప్పటికే జరిగిపోయింది.
పోలవరం నిర్వాసితుల్లో అసంతృప్తిని తొలగించడానికి కాంగ్రెస్ ముప్పుతిప్పలు పడుతోంది. ముఖ్యమంత్రి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ప్రచారంతో పార్టీకి కొత్తగా జీవం వస్తుందన్న ధీమా నేతల్లో ఉంది. ఈ నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ కొంత గందరగోళ పరిస్థితినే ఎదుర్కొంటోంది. ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి తెల్లం బాలరాజుపై ఉన్న వ్యతిరేకత పార్టీని కలవరపరుస్తోంది.
బాలరాజుపై ఉన్న వ్యతిరేకత కారణంగానే జగన్ రోడ్షోలకు పెద్దగా స్పందన కనిపించలేదనే ప్రచారం జరిగింది. బాలరాజును ఒకటి రెండుచోట్ల స్థానికులు నిలదీసే ప్రయత్నం కూడా చేశారట. గిరిజనులను ఆకట్టుకోవడానికి అన్ని పార్టీలు ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు కొత్త వరాలను అధికారపక్షం ప్రకటించింది. వీటిని తిప్పికొడుతూ టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు కొత్త హామీలు ఇచ్చాయి. టి.నరసాపురం, పోలవరం, కొయ్యలగూడెం మండలాలు కీలకం కావడంతో ఇక్కడ వివిధ సామాజికవర్గాలను ఆకట్టుకోవడంలో ప్రధానపక్షాల మధ్య పోటీ తీవ్రంగా ఉంది.