మోడీ సంచలన నిర్ణయం!: రాష్ట్రపతిగా రజినీకాంత్?, ఎందుకంటే?
దక్షిణ భారతదేశంపై ప్రత్యేక దృష్టిని సారించిన భారతీయ జనతా పార్టీ ఆ దిశగా అడుగులు వడివడిగా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కర్ణాటకలో పాగా వేస్తామన్న ధీమాతో ఉన్న బీజేపీ..
న్యూఢిల్లీ/చెన్పై: దక్షిణ భారతదేశంపై ప్రత్యేక దృష్టిని సారించిన భారతీయ జనతా పార్టీ ఆ దిశగా అడుగులు వడివడిగా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కర్ణాటకలో పాగా వేస్తామన్న ధీమాతో ఉన్న బీజేపీ.. తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడుపై ప్రత్యేక దృష్టిని సారిస్తోంది. తమిళనాడు పాగా వేసేందుకు సరికొత్త ఎత్తుగడకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. బీజేపీ.
రాష్ట్రపతి పదవికి..
తమిళులకు ఆరాధ్యదైవమైన ప్రముఖ నటుడు, సూపర్ స్టార్ రజినీకాంత్ను భారత రాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టేందుకు బీజేపీ సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తునాన్నియి. ఢిల్లీతోపాటు చెన్నైలో కూడా ఈ వార్త విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ రూపొందించిన రాష్ట్రపతి అభ్యర్థుల జాబితాలో రజినీకాంత్ పేరు కూడా ఉన్నట్లు సమాచారం.
వాజ్పాయిలాగే మోడీ..
గతంలో అప్పటి ప్రధాని వాజ్పాయి ప్రభుత్వం.. ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేసి ప్రజలను ఎలా ఆశ్చర్యానికి గురిచేశారో.. ఇప్పుడు మోడీ కూడా రజినీకాంత్ను రాష్ట్రపతిని చేసి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం.
రాష్ట్రపతి పదవికి దూరమైన అద్వానీ, జోషీ
కాగా, బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిల పాత్రపై విచారణ కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో వారు రాష్ట్రపతి అయ్యే అవకాశాన్ని కోల్పోయినట్లేనని తెలుస్తోంది. అప్పట్లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించాలని అనుకున్నప్పటికీ పనామా పేపర్లలో ఆయన పేరు రావడంతో ఉపసంహరించుకున్నట్లు తెలిసింది.
తెరపైకి రజినీ..
ఈ క్రమంలో సూపర్ స్టార్ రజినీ పేరు ప్రముఖంగా వినిపించడం గమనార్హం. వివాదారహితుడిగా, తమిళ ప్రజల ఆరాధ్యదైవంగా ఉన్న రజినీని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించాలని మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. జూలైలో ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం ముగియనుండగా.. మరోసారి ఆయన పదవీ కాలాన్ని పొడగించాలనే ఆలోచన మోడీ ప్రభుత్వానికి లేదనే తెలుస్తోంది. రాష్ట్రపతి ఎంపికకు కావాల్సిన బలం ఎన్డీఏకి దాదాపు ఉన్నప్పటికీ.. అన్నాడీఎంకే లేదా బీజేడీ మద్దతు అవసరమయ్యే అవకాశం ఉంది.
రజినీ అయితే ఏకాభిప్రాయం రావొచ్చు
ఒక వేళ రజినీని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తే ఏకాభిప్రాయం వచ్చే అవకాశం కూడా ఉంది. సౌమ్యుడిగా, వివాదరహితుడిగా ఉన్న రజినీకి అన్ని పార్టీల నుంచి మద్దతు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు రజినీకాంత్ రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. అయితే, 2000లలో మాత్రం రాజకీయాలపై కొంత ఆసక్తి చూపినా.. ప్రత్యక్షంగా మాత్రం ఎప్పుడూ పాల్గొనలేదు. కాగా, రజినీని బీజేపీ ప్రతిపాదించినట్లయితే ఏ పార్టీ కూడా వ్యతిరేకించే అవకాశం లేదు. ఎందుకంటే.. రజినీకి తమిళనాడుతోపాటు దేశ వ్యాప్తంగా భారీగా అభిమానులు ఉన్నారు. అతని అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తే ఆ పార్టీలకు ప్రజల నుంచి చేదు అనుభవం ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. రజినీని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తే.. తమిళనాడుకు చెందిన అధికార పార్టీ అన్నాడీఎంకే కూడా తప్పనిసరి పరిస్థితుల్లో మద్దతు తెలపాల్సి ఉంటుంది. లేదంటే రజినీ అభిమానుల నుంచి ఆ పార్టీకి ఘోర పరాభవం కలిగే అవకాశం లేకపోలేదు.
మిలిటరీ శక్తి నుంచి సౌమ్య శీలి వరకు
గతంలో బీజేపీ.. సైన్స్, న్యూక్లియర్, రక్షణ సాంకేతికతలో అనుభవజ్ఞనులైన శాస్త్రవేత్త కలాంను రాష్ట్రపతిని చేసింది. ఆయన మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ప్రసిద్ధి చెందారు. ప్రపంచానికి భారత రక్షణ వ్యవస్థ సత్తాను చాటడంలో కలాం పాత్ర వెలకట్టలేనిది. కాగా, కళా, సాంస్కృతిక రంగాల్లో అద్భుతంగా రాణించి పద్మ విభూషణ్, పద్మభూషణ్ అవార్డులను దక్కించుకున్నారు రజినీకాంత్. బయటి ప్రపంచంలో రజినీకాంత్ ఎంతో సౌమ్యుడి, మృధు స్వభావిగా పేరు తెచ్చుకున్నారు. రజినీ ఎంపిక కూడా భారతదేశానికి మరోసారి అలాంటి వ్యక్తిత్వాన్ని కలిగించినట్లవుతుంది.
తమిళనాడుపై బీజేపీ దృష్టి
ఇప్పటికే తమిళనాడులో పాగా వేయాలని బీజేపీ భావిస్తోంది. ఇందుకోసం ముమ్మర ప్రయత్నాలైతే ఏమీ చేయలేదు. అయితే, ఇందుకు కొంత సమయం పట్టవచ్చు. ఈ క్రమంలోనే రజినీని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించి తమిళ ప్రజల హృదయాలను గెలుచుకోవాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, బీజేపీపై తమిళనాడులో ఎప్పుడూ హిందీ పార్టీ అని ముద్రవేసి స్థానిక పార్టీలు లభ్ది పొందుతున్నాయి. అయితే, శశికళ నటరాజన్, టీటీవీ దినకరణ్లను అన్నాడీఎంకే ప్రభుత్వానికి దూరం చేసినందుకు తమిళ ప్రజలు బీజేపీ పట్ల కొంత సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రజినీని రాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టి తమ రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సాంకేతాలను పంపాలని.. తద్వారా తమిళనాడులో పాగా వేయాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.