కిరణ్పై దినేష్: డిగ్గీ వ్యూహమా, జగన్ పార్టీలోకా?
ఆంధ్రప్రదేశ్ మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు(డిజిపి) దినేష్ రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దినేష్ రెడ్డి స్వంతగానే ఈ విమర్శలు చేశారా? ఆయన వెనుక ఎవరైనా ఉన్నారా? రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా? అనే పలు రకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి. డిజిపి వ్యాఖ్యల వెనుక కాంగ్రెసు పార్టీ ఢిల్లీ పెద్దల హస్తం కూడా ఉండి ఉండవచ్చుననే అనుమానాలు కూడా పలువురిలో తలెత్తుతున్నాయి.
సిడబ్ల్యూసి విభజన నిర్ణయం అనంతరం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, దిగ్విజయ్ సింగ్ల మధ్య మాటల యుద్ధం సాగిన విషయం తెలిసిందే. కిరణ్ సమైక్యవాదాన్ని బలంగా వినిపిస్తుండగా, డిగ్గీ అందుకు ధీటుగా స్పందిస్తున్నారు. ఇరువురు నేతలు పరోక్షంగా కౌంటర్లు వేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో దినేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తే డిగ్గీ ముఖ్యమంత్రిని సమర్థించినట్లుగా మాట్లాడారు.
ముఖ్యమంత్రికి ఆయన సమర్థింపు వెనుక గూడార్థముందని అనుమానిస్తున్నారు. తద్వారా ఢిల్లీ పెద్దలే మాజీ డిజిపిని ముఖ్యమంత్రి పైకి ప్రయోగించి ఉంటారా అని అనుమానిస్తున్నారు. విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రి పైన దిగ్విజయ్ అంతకుముందు కటువుగానే మాట్లాడారు.
అలాంటి ఢిల్లీ పెద్ద దినేష్ వ్యాఖ్యల పైన ఆయన స్పందించాల్సిన అవసరం లేదని కానీ, ఆయనకు ముఖ్యమంత్రిని సమర్థిస్తూనే దినేష్కు సవాల్ చేయడం ద్వారా పురికొల్పుతున్నారా, దినేష్ వెనుక ఢిల్లీ ఉందా అని అనుమానిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా సమావేశాలు జరిపిన ఆనం రామనారాయణ రెడ్డి కూడా తీవ్రంగా ఖండించారు.
అదే సమయంలో దినేష్ రెడ్డి వెనుక పెద్దల హస్తం ఏమీ లేదని, ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించాలనుకుంటున్నందునే కిరణ్ పైన విమర్శలు గుప్పించారని మరికొందరు అంటున్నారు. ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లాలనే యోచనలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఒంగోలు పార్లమెంటు స్థానంపై కన్నేశారని, కర్చీఫ్ కూడా వేశారని ప్రచారం జరుగుతోంది.