జగన్వద్ద నో ఖాళీ!: టిక్కెట్ ఇప్పించమన్న ఏరాసు
కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ హౌస్ఫుల్ అయిందా అంటే అవుననే అంటున్నారు. ఇటీవల జగన్ పార్టీ ఫుల్ అయినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. 2014 ఎన్నికల కోసం టిక్కెట్ ఆశించి వచ్చే వారిని ఇక ఆ పార్టీలోకి తీసుకోరని, కేవలం పార్టీలో పని చేసేందుకు మాత్రం ఎవరైనా రావొచ్చుననే, టిక్కెట్ కోసం ఆశించి మాత్రం పార్టీలోకి వస్తే ఆహ్వానించే పరిస్థితి లేదని వార్తలు వచ్చాయి.
తాజాగా న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి వ్యాఖ్యలు జగన్ పార్టీ హౌస్ ఫుల్ అయిందనే వాదనకు బలం చేకూరుస్తున్నాయి. మీరు ఇతర పార్టీలోకి వెళ్తున్నట్లుగా ప్రచారం జరుగుతోందని మీడియా ఆయనను శనివారం ప్రశ్నించింది. దానికి ఆయన స్పందిస్తూ... వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో టిక్కెట్ ఇప్పిస్తే పార్టీ మారేందుకు తాను సిద్ధమేనని చెప్పారు.
తాను ఇప్పటికే మంత్రి పదవికి, పార్టీకి రాజీనామా చేశానని తెలిపారు. ఏరాసు వ్యాఖ్యలతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో టిక్కెట్లు ఆశించి వచ్చే వారికి అవకాశం లేదని, అక్కడ హౌస్ఫుల్ అయిందనే ప్రచారానికి బలం చేకూరుతుందనే చెప్పవచ్చు.
కాగా, కాంగ్రెస్ పార్టీ తెలివి తక్కువతనం వల్లే రాష్ట్రంలో అధ్వాన పరిస్థితులు తలెత్తాయని ఏరాసు సొంత పార్టీ పైన ధ్వజమెత్తారు. అనాలోచితంగా, బుద్ధిహీనతతో కాంగ్రెస్ పార్టీ విభజన నిర్ణయం తీసుకుందని, దీంతో పార్టీకి ఇక పుట్టగతులుండవని చెప్పారు. విభజనకు ఆర్టికల్-3ను మొక్కుబడిగా పాటించి ముందుకెళ్తామనడం కాంగ్రెస్ పెద్దల తెలివి తక్కువతనం తప్ప మరేమీ కాదని అన్నారు.
రాష్ట్ర విభజన రద్దు కావాలంటే మూడే మూడు ప్రధాన కారణాలు ఉన్నాయని, విభజనకు రాష్ట్రపతి అభ్యంతరం చెప్పినా, సుప్రీం కోర్టు విభజన ప్రక్రియను రద్దు చేయాలని ఆదేశించినా, లేక జాతీయ పార్టీలన్నీ పార్లమెంట్లో బిల్లును వ్యతిరేకించినా విభజన నిలిచిపోతుందని పేర్కొన్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగడం కన్నా సీమాంధ్రులు కొత్త రాజధాని ఏర్పాటు చేసుకోవడమే ఉత్తమని తెలిపారు.