షాకింగ్ కామెంట్: కోల్కతా ఘటన విధి లిఖితమట!
హైదరాబాద్: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో వంతెన కూలి 25 మంది మృతి చెందిన ఘటన పైన ఐవీఆర్సీఎల్ సంస్థ సీనియర్ అధికారులు హైదరాబాద్లో విలేకర్లతో మాట్లాడారు. దుర్ఘటన విధి లిఖితం తప్ప మరోటి కాదని ఐవీఆర్సీఎల్ సంస్థ మానవవనరులు, పరిపాలన విభాగాధిపతి పాండురంగా రావు చెప్పారు.
ఇరవై ఏడేళ్లుగా తాము ఎన్నో ఫ్లై ఓవర్లను నిర్మించామని, ఇటువంటి ప్రమాదం ఎప్పుడూ జరగలేదన్నారు. ఘటనా స్థలంలో ఉన్న తమ సంస్థకు చెందిన ఇద్దరు ఇంజినీర్లు కనిపించటం లేదని, వారికోసం వెతుకుతున్నామన్నారు.
ప్రమాదం వెనక నాణ్యత, టెక్నాలజీ పరమైన తప్పిదాలు లేవన్నారు. డెబ్బై శాతం వంతెన నిర్మాణం పూర్తయిందని ఆ సంస్థ డైరెక్టర్ మూర్తి చెప్పారు. ఘటనపై ప్రభుత్వం నిర్వహించే దర్యాప్తునకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఇది దురదృష్టకరమని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
వంతెనలో ఓ భాగానికి స్లాబు వేస్తుండగా కూలిపోయిందని కంపెనీ డైరెక్టర్ మూర్తి తెలిపారు. ఇదిలా ఉండగా, వంతెనను నిర్మిస్తున్న హైదరాబాద్కు చెందిన కంపెనీలోని ఓ ఉన్నతాధికారి ఈ ప్రమాదాన్ని విధిలిఖితంగా పేర్కొనటంపై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.
ప్లైఓవర్ను నిర్మాణ పనులు చేస్తున్న కంపెనీ ఐవీఆర్సీఎల్ హైదరాబాద్కు చెందినది కావడం గమనార్హం. హైదరాబాద్తో పాటు దేశ వ్యాప్తంగా మౌలిక వసతుల సదుపాయాల కల్పనే లక్ష్యంగా ఎదిగిన ఐవీఆర్సీఎల్ ఈ ఫ్లై ఓవర్ పనులు చేస్తోంది.
మరోవైపు, కోల్కతాలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కూలిన ఘటనపై దర్యాప్తు బృందం విచారణ ముమ్మరం చేసింది. వంతెనను నిర్మిస్తున్న ఐవీఆర్సీఎల్ సిబ్బందిని ఐదుగురు పోలీసుల బృందం విచారిస్తోంది. హైదరాబాద్లోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలో విచారణ కొనసాగుతోంది.
కోల్కతా దుర్ఘటన
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో గురువారం మధ్యాహ్నం ఘోరప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్లో కొంతభాగం కుప్పకూలి 25 మంది దుర్మరణం పాలయ్యారు. చాలామంది గాయపడ్డారు. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు.
కోల్కతా దుర్ఘటన
దుర్ఘటన జరిగిన బుర్రా బజార్ ప్రాంతం నగరంలోనే అతిపెద్ద హోల్సేల్ మార్కెట్ కావటంతో ప్రమాద త్రీవత ఎక్కువగా ఉందంటున్నారు. బాధితుల్లో ఎక్కువగా పాదచారులు, వీధివ్యాపారులు, వాహనదారులు ఉన్నట్లు చెబుతున్నారు. ఘటనాస్థలంలోని సీసీకెమెరాల్లో ప్రమాదదృశ్యాలు రికార్డయ్యాయి.
కోల్కతా దుర్ఘటన
పైవంతెన కిందనుంచి వెళ్తున్న మనుషులు, వాహనాలపై ఒక్కసారిగా అత్యంత బరువైన కాంక్రీట్ దిమ్మలు పడటం వీటిల్లో కనిపించింది. ఘటనాస్థలమంతా రక్తసిక్తమైంది. శిథిలాల్లో చిక్కుకుపోయి ఆర్తనాదాలు చేస్తున్న వారికి జనం నీళ్లసీసాలను అందించి వారి ప్రాణాలు నిలబెట్టే ప్రయత్నం చేశారు.
కోల్కతా దుర్ఘటన
గాయాల పాలైన వారిని పోలీసులు సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. సహాయకచర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు, ఆగ్నిమాపక సిబ్బందితోపాటు రక్షణమంత్రి మనోహర్ పారికర్ ఆదేశాల మేరకు ఐదు కాలమ్ల సైనిక సిబ్బంది పాల్గొంటున్నారు. స్థానికులు వీరికి సహకరిస్తున్నారు.
కోల్కతా దుర్ఘటన
పైవంతెన నిర్మాణ సంస్థ ఐవిఆర్సీఎల్ కార్యాలయాన్ని మూసివేశామని, ఆ సంస్థపై కేసు నమోదు చేశామని కోల్కతా సంయుక్త పోలీసు కమిషనర్ దేబశిశ్బోరల్ వెల్లడించారు.