బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు .. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మోడీ, వెంకయ్యనాయుడు, రాహుల్ గాంధీ తదితరులు
తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకున్న బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్రమోడీతో పాటు పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమిళనాడులోని సత్తూరు జిల్లాలోని బాణాసంచా తయారీ కర్మాగారంలో జరిగిన పేలుడులో శుక్రవారం 11 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.
విరుద్ నగర్ జిల్లా వెంబ కొట్టాయ్ వద్ద ఒక ప్రైవేట్ బాణాసంచా ఫ్యాక్టరీ సిబ్బంది బాణాసంచా తయారీకి కొన్ని రసాయనాలను కలుపుతున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. భారీ పేలుడు సంభవించడంతో పదకొండు మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.

మనసు చాలా దుఃఖంతో ఉందన్న మోడీ
మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటనపై నరేంద్రమోడీ విచారం వ్యక్తం చేశారు. తమిళనాడులో విరుద్ నగర్ లోని బాణాసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్న ఘటనపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోడీ తమిళనాడు రాష్ట్రం తీవ్ర ఆవేదన లో ఉందని, బాధిత కుటుంబాలతో కలిసి తాను కూడా దుఃఖంలో ఉన్నానని పేర్కొన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నానని, బాధిత కుటుంబాలకు సహాయం చేయడానికి అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారంటూ ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్లో పేర్కొన్నారు.

బాధిత కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన రాహుల్ గాంధీ
తమిళనాడులోని విరుద్ నగర్లో జరిగిన ఫైర్క్రాకర్ ఫ్యాక్టరీ భారీ పేలుడు ఘటనపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. బాధిత కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు . తన మనస్సు ఇంకా లోపల చిక్కుకున్న వారి గురించి ఆలోచిస్తూ ఉందంటూ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.
తక్షణ రక్షణ, బాధిత కుటుంబాలకు మద్దతుతో పాటు ఉపశమనం అందించాలని నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

స్పందించిన వెంకయ్య నాయుడు .. తీవ్ర ఆవేదనకు గురయ్యా
తమిళనాడులోని విరుద్ నగర్లో జరిగిన బాణాసంచా ఫ్యాక్టరీ భారీ పేలుడు ఘటన పై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించడంతో పలువురుప్రాణాలు కోల్పోయినందుకు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మరణించిన కుటుంబాలకు తన సంతాపం తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. గాయపడినవారిని త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అన్నారు.

భారీ పేలుడు ఘటనపై ఆవేదన వ్యక్తం చేసిన రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్
బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు ఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పందించారు. తమిళనాడులోని బాణాసంచా ఫ్యాక్టరీ లో జరిగిన ఘటనలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు అని తెలిసి ఆవేదన చెందుతున్నానని , బాధిత కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు . గాయపడిన వారికి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అన్నారు. వారంతా ధైర్యంగా ఉండాలని అశోక్ గెహ్లాట్ తన ట్విట్టర్ హ్యాండిల్ లో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications