మేటాస్ బోర్డుల రద్దు: గుప్తా
హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ మాజీ అధినేత రామలింగరాజు కుమారులు నిర్వహిస్తున్న మేటాస్ ప్రాపర్టీస్ లిమిటెడ్, మేటాస్ ఇన్ఫ్రా లిమిటెడ్ కంపెనీల బోర్డులను రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుత డైరెక్టర్లను తొలగించి కొత్త బోర్డును ఏర్పాటు చేయడానికి కంపెనీలా బోర్డు (సీఎల్బీ) అనుమతిని కోరినట్లు కార్పొరేట్ వ్యవహారాల మంత్రి ప్రేమ్ చంద్ గుప్తా విలేకరులకు చెప్పారు.
ఈ కంపెనీలు భవిష్యత్తులో మరింత మోసానికి పాల్పడకుండా నిరోధించేందుకు, ప్రజా ప్రయోజనాల కోసం వీటిని కాపాడేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వివరించారు. ఈ రెండు కంపెనీల్లో కూడా 'సత్యం' తరహా కుంభకోణాలే జరిగినట్లు ప్రభుత్వం అనుమానిస్తోందన్నారు. తప్పుడు లెక్కలు, మనీ ల్యాండరింగ్, నిధుల అక్రమ మళ్లింపు మొదలైన అక్రమాలకు పాల్పడిన సత్యం కుంభకోణంతో మేటాస్కు చెందిన రెండు కంపెనీలకు సంబంధం ఉన్నదని రుజువైందని చెప్పారు.
ఈ రెండు కంపెనీల బోర్డుల్లో ఉన్న వారు వేరే ఏ ఇతర కం పెనీలోనూ డైరెక్టర్లుగా చేరకుండా చూడాలని కూడా సీఎల్బీని కోరామని తెలిపారు. ప్రభుత్వం ఈ రెండు కంపెనీలను స్వాధీనం చేసుకుంటుందన్నారు. కొత్త బోర్డుల్లో ప్రభుత్వం సిఫార్సు చేసిన వారిని నామినేట్ చేయాలని సూచించామని తెలిపారు. తమ అభ్యర్థనపై ఫిబ్రవరి 24న కంపెనీ లా బోర్డు నిర్ణయం తీసుకుంటుందని గుప్తా చెప్పారు. బోర్డ్ డైరెక్టర్లు ఆస్తులను అమ్ముకోకుండా, కుదువబెట్టకుండా, అడ్డుకోవాలని కూడా సీఎల్బీని కోరినట్లు వెల్లడించారు. రామలింగ రాజు చిన్న కుమారుడు బి.తేజా రాజు మేటాస్ వైస్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. మేటా స్లో రాజు కుటుంబానికి 36 శాతం ఈక్విటీ ఉంది. మేటాస్ ఇన్ఫ్రాకు హోల్ టైమ్ డైరెక్టర్గా చందర్ షీల్ బన్సల్, ఇండిపెండెంట్ డైరెక్టర్గా డా.ఆర్.పి.రాజు ఉన్నారు.