వైయస్ కోడ్ ఉల్లంఘన: తెరాస
నిజామాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. పాఠశాలలో వైయస్ బహరింగసభ నిర్వహించడం ద్వారా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని తెరాస ఫిర్యాదు చేసింది. నిజామాబాద్ జిల్లాలో ప్రచారయాత్ర నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి తానే ఎన్నికల కోడ్ను యధేచ్ఛగా ఉల్లంఘించారు. ఆదిలాబాద్నుంచి నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ చేరుకున్న ముఖ్యమంత్రి అక్కడి హైస్కూలు ఆవరణలో ఏర్పాటుచేసిన బహిరంగసభలో పాల్గొన్నారు.
రాజకీయపార్టీలు పాఠశాల ఆవరణలో సభలు నిర్వహించుకోవచ్చునని ఎన్నికల కమిషన్ తెలియజేసింది. అయితే అందుకు అనుమతి తీసుకోవాలని షరతు విధించింది. రాజకీయ పార్టీలు పాఠశాల సమయంలో నిర్వహించటం సాధారణమే. అయితే పాఠశాల నడుస్తున్న సమయంలో, అదీ పరీక్షల సమయంలో ముఖ్యమంత్రి సభ జరగడం విమర్శలకు దారి తీసింది. వైయస్ సభ జరుగుతున్న సమయంలో పాఠశాలలో విద్యార్థులు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాస్తున్నారు. ఆ సమయంలో లౌడ్స్పీకర్లు, హోరెత్తే ప్రసంగాలతో విద్యార్థులు తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఈ ఘటనపై ఎన్నికల పర్యవేక్షణ అధికారి మీరా శ్రీ వాస్తవ్ ఆరా తీస్తున్నారు.