కె చంద్రశేఖర రావుతో చర్చలకు మంత్రికి బాధ్యత: సబితా ఇంద్రారెడ్డి
కెసిఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. కెసిఆర్ ఆరోగ్యం గురించి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దానం నాగేందర్ ఎప్పటికప్పుడు మీడియాకు వెల్లడిస్తారని ఆమె చెప్పారు. కెసిఆర్ ఆరోగ్యం ప్రమాదకరంగా ఉందని ఆయన వ్యక్తిగత వైద్యుడు గోపీనాథ్ చేసిన ప్రకటనను మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా ఏ రకంగా కెసిఆర్ ఆరోగ్యం బాగా లేదో చెప్పాలని, చికిత్సకు ఫలానా ఏర్పాట్లు లేవని చెప్పారా, ప్రభుత్వ వైద్యుల బృందం ఇచ్చిన నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని ఆమె చెప్పారు. ఫలానా చికిత్స అవసరమని, ఫలానా పరికరాలు ఇక్కడ లేవని ఆ వైద్యుడు చెప్పాలని ఆమె అన్నారు. కెసిఆర్ ఆరోగ్య గురించి తెలుసుకున్న తర్వాతనే మీడియా ముందుకు వచ్చినట్లు ఆమె తెలిపారు.
కెసిఆర్ ను ఖమ్మం నుంచి తరలించే విషయం తర్వాత అని, దీక్ష విరమించాలని తాము కోరుతున్నామని ఆమె చెప్పారు. కెసిఆర్ ప్రాణ హాని ఉందని చెప్పినందున తమ కస్టడీలో ఉన్న ఆయనకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందని, అందుకే పోలీసులను నియోగించామని ఆమె ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కెసిఆర్ కోర్టు కస్టడీలో ఉన్నారని, కోర్టు ఆదేశాల ప్రకారం తాము చూసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. తాము ఏమీ హామీ ఇవ్వలేమని ప్రభుత్వ ప్రతినిధిగా కెసిఆర్ వద్దకు వెళ్తున్న రాంరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణపై సోనియాతో కెసిఆర్ కూడా మాట్లాడారని, తమ బాధ్యత కాబట్టి దీక్ష విరమించాలని కోరడానికి మాత్రమే తాను వెళ్తున్నానని ఆయన చెప్పారు. కెసిఆర్ ఉదయం కూడా ఫోన్ లో తనతో మాట్లాడారని, కెసిఆర్ ఆరోగ్యం బాగానే ఉందని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో 9 మంది మంత్రులు, డిజిపి గిరీష్ కుమార్, ఇంటలిజెన్స్ ఐజి పాల్గొన్నారు. కెసిఆర్ తరలింపు విషయంలో కోర్టు ఆదేశాలు తమకు అందిన తర్వాత చర్యలు తీసుకుంటామని డిజిపి చెప్పారు.