రోశయ్య టూర్: కుదరని సయోధ్య
ముఖ్యమంత్రి పర్యటనలో పలు అపశ్రుతులు దొర్లాయి. ఉదయం పోలీసుపెరేడ్ గ్రౌండు వద్ద మీడియాకు, ఎఎస్ పి నారాయణ నాయక్ కు మధ్య వాగ్వివాదం జరిగింది. పోలీసు పెరేడ్ మైదానంలో ప్రముఖులకు ఏర్పాటుచేసిన షామియానా హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే సమయంలో కూలిపోయింది. మాజీ ఎమ్మెల్యే జయరాంబాబుకు స్వల్ప గాయమైంది. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు శంకుస్థాపన కార్యక్రమం వద్ద తాజాగా నిర్మించిన ప్రహారీ కూలిపోయింది. ముగ్గురు ఫొటోగ్రాఫర్లు కిందపడిపోయారు.
ప్రోటోకాల్ ను పాటించే విషయంలో గుంటూరు జిల్లా కలెక్టరు మార్గదర్శకాలను మరోమారు సరిచూసుకోవాలని శాసనమండలి ఉపాధ్యక్షుడు మహమ్మద్ జానీ సూచించారు. ఆయన సభావేదికపైకి తొలుత రాలేదు. ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందంటూ దూరంగా చెట్టు కింద ఆశీనులయ్యారు. ఆ తరువాత అధికారులు వెళ్లి సముదాయించి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోశయ్యపై ఉన్న గౌరవంతోనే తాను వేదికపైకి వచ్చానని, ఇకనుంచైనా ప్రోటోకాల్ మార్గదర్శకాలను జిల్లా యంత్రాంగం సరిచూసుకోవాలంటూ గతంలో జరిగిన అంశాలను ఆయన ప్రస్తావించారు.