బిసి నేత కృష్ణయ్య ఆమరణ దీక్ష భగ్నం: ఆస్పత్రికి తరలింపు
కృష్ణయ్యను అరెస్టు చేసి ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో బీసీభవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. నాయకులకూ, పోలీసులకూ తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది. కొందరికి గాయాలయ్యాయి. తోపులాట కారణంగా ఓ నేత ఏకంగా స్పృహ కోల్పోయాడు. అతన్ని కూడా పోలీసులు ఆసుపత్రికి తరలించారు. మహిళా నాయకులని కూడా చూడకుండా దొరికిన వాళ్లని దొరికినట్లు పోలీసులు బలవంతంగా లాక్కెళ్లారు. బీసీభవన్లో శుక్రవారం ఉదయం దీక్షను ప్రారంభించిన కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వ బీసీ వ్యతిరేక ధోరణిపై విరుచుకుపడ్డారు. బోధనాఫీజులను పూర్తిగా చెల్లించే వరకూ వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ముమ్మాటికీ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వ్యతిరేకమేనని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. మార్చి 31న బలహీనవర్గాల విద్యార్థుల బిల్లుల కోసం రూ.600 కోట్ల విడుదలకు ఆదేశాలు జారీచేసి చివరి నిమిషంలో నిలిపివేశారన్నారు.
బీసీ నేత ఆర్.కృష్ణయ్య డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించనందుకు నిరసనగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ ఎర్రసత్యంలు తెలిపారు. వేల సంఖ్యలో విద్యార్థులతో కలసి రాష్ట్ర, జాతీయ రహదారులపై రాస్తారోకోలు నిర్వహిస్తామని చెప్పారు. ఆర్.కృష్ణయ్యను అరెస్టు చేసి దీక్షను భగ్నం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు నిరసనగా బీసీ యువజన సంఘం, ఈబీసీ సంక్షేమ సంఘం ఖండించాయి. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ, ఆర్.కృష్ణయ్య పెట్టిన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ శనివారం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలను దిగ్బంధిస్తామని బీసీ యువజన సంఘం అధ్యక్షులు జె.శ్రీనివాస్గౌడ్ శుక్రవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు.