పండు హత్య కేసు: మహేందర్ రెడ్డి వెనక ఉన్నదెవరు?
పండు వద్దకు తరుచుగా రత్నాకర్ మరో వ్యక్తి వస్తుంటారని, ఆదివారం రాత్రి వారు వచ్చారా లేదా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పండు హత్య కేసు నిందితులను పట్టుకోవడానికి మూడు పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఖాన్ చెప్పారు. పండు హత్య కేసుకు సంబంధించిన విషయాలు విజయవాడలోనే ఉన్నాయని, అందుకే విజయవాడకు ఓ బృందాన్ని పంపామని ఆయన చెప్పారు. మహేందర్ రెడ్డి అలియాస్ పిచ్చిరెడ్డి హత్య చేశాడని బలంగా నమ్ముతున్న పోలీసులు మహేందర్ రెడ్డి వెనక ఉన్నదెవరనే కోణం నుంచి ఆరా తీస్తున్నారు. మహేందర్ రెడ్డి అనుచరుడు బత్తినిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా, విశాఖపట్నంలోని ఓ భూవివాదమే పండు హత్యకు కారణమని అనుకుంటున్నారు. దీంతో విశాఖ పోలీసులను కూడా అప్రమత్తం చేశారు. ఈ భూవివాదం నుంచి తప్పుకోవాలని పండుకు 15 రోజుల క్రితమే హెచ్చరికలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయానికి సంబంధించి విజయవాడ పోలీసుల వద్ద కేసు కూడా నమోదైనట్లు చెబుతున్నారు. వివాదం నుంచి తప్పుకోకుండా పండు హైదరాబాదుకు మకాం మార్చి ఇక్కడి నుంచే వ్యవహారం నడుపుతున్నట్లు చెబుతున్నారు. ఈ భూవివాదంలో విశాఖపట్నం జిల్లాకు చెందిన రాష్ట్ర స్థాయి నాయకులున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో హత్య వెనక తెలుగుదేశం రాష్ట్ర స్థాయి నాయకుల పాత్రపై ఆరా తీస్తున్నారు. మహేందర్ రెడ్డిని వాడుకుని పండును హత్య చేసి ఉంటారా అనే కోణం నుంచి కూడా పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. పండు హత్యకు నిరసనగా విజయవాడలో బంద్ జరుగుతోంది.