బిజెపి, తెలంగాణలపై స్పష్టంగా తేల్చేసిన వైయస్ జగన్
జగన్ పార్టీ మేనిఫెస్టోలో ముస్లింలకు ఏ మేరకు న్యాయం చేస్తారు, పశ్చిమ బెంగాల్లో మాదిరిగా ఇక్కడ కూడా ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్ అమలు చేస్తారా, ఎన్డీఏ వైపు ఉంటారా, లేక యూపీఏ వైపా, తెలంగాణపై పార్టీ వైఖరెలా ఉంటుంది వంటి ప్రశ్నలు వేశారు. వాటికి జగన్ సవివరంగా సమాధానాలిచ్చారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో లేకపోయినా వైఎస్ రాజశేఖరరెడ్డి ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించారని గుర్తు చేశారు. తన వెంట ముస్లింలున్నారని, వారి వెంట తానుంటానని అన్నారు. నాలుగు శాతం రిజర్వేషన్ను అన్ని రంగాల్లోనూ అమలు చేస్తామని, సాధ్యమైతే ఆ శాతాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ ఇవ్వడం, ఇవ్వకపోవడం తన చేతిలో లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినా అక్కడ కూడా వైఎస్ రాజశేఖరరెడ్డిని గుండెల్లో పెట్టుకున్న కోట్లాది మంది అభిమానులున్నారని, అక్కడా పార్టీ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ''నాన్న నాకు నేర్పింది ఒక్కటే.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, వెనక్కు తగ్గకపోవడం. నేను కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను"" అని ముస్లిం మత పెద్దలకు భరోసా ఇచ్చారు. వైఎస్ మరణానంతరం సోనియాగాంధీ, కాంగ్రెస్ అధిష్టానం తనను, తన కుటుంబాన్ని అవమానాలపాలు చేసి పార్టీ నుంచి బయటకు రావాల్సిన పరిస్థితి కల్పించిన తీరును వారికి వివరించారు. జగన్ కూడా ఆయన తండ్రిలాగే ఇచ్చిన మాట తప్పరని హరూన్ బజాజ్ షోరూం అధినేత, మాజీ కార్పొరేటర్ అంజాద్ బాషా పేర్కొన్నారు. ఆయన వెంట ముస్లింలంతా నడుద్దామని మత పెద్దలకు విజ్ఞప్తి చేశారు.